ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్రంలో ఇంత రాజకీయ గందరగోళం లేదు. కానీ జగన్ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించడంతో రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
చంద్రబాబు నాయుడుని బయటకు రానీయకూడదని జగన్ ప్రభుత్వం ఫిక్స్ అయిన్నట్లే కనిపిస్తోంది. నారా లోకేశ్తో సహా టిడిపి ముఖ్యనేతలందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తామని మంత్రులే గొప్పగా చెప్పుకొంటున్నారు. కనుక టిడిపి పరిస్థితి ఏమిటి?
చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేసేశారు. కానీ ఇంతవరకు బీజేపీ అధిష్టానం స్పందించలేదు కనీసం పట్టించుకోలేదు. ఈ కారణంగా జనసేన తీవ్ర అసహనంతో ఉంది.
పొత్తులో ఉన్న బీజేపీ-జనసేనలు ఇంతవరకు ఎటువంటి సమిష్టి కార్యాచరణ చేపట్టలేకపోతుంటే, టిడిపి, జనసేనలు మాత్రం సమిష్టి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. త్వరలోనే సీట్ల సర్దుబాట్లపై కూడా ఇరు పార్టీలు చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్నాయి. మరి బీజేపీ ఏ గట్టున ఉంటుంది? జనసేన…. వైసీపి వైపా?
టిడిపి చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1నుంచి మళ్ళీ నాలుగో విడత వారాహియాత్ర మొదలుపెట్టబోతుండటం చాలా ప్రాధ్యాన్యం సంతరించుకొంది. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలుపెట్టి, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలలో యాత్ర చేయనున్నారు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం జగన్ ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట అని గట్టిగా వాదిస్తున్న పవన్ కళ్యాణ్, ఈ యాత్రలో ఈ అంశాలనే హైలైట్ చేయడం ఖాయం. కనుక టిడిపికి సంఘీభావంగానే పవన్ కళ్యాణ్ ఈ యాత్ర మొదలుపెడుతున్నట్లు భావించవచ్చు. కనుక పవన్ యాత్ర టిడిపి శ్రేణులు కూడా స్వాగతించడం ఖాయమే. మరి బీజేపీ ఏమి చేయాలనుకొంటోంది?
ఈ యాత్రకు పవన్ కళ్యాణ్ ఎంచుకొన్న నియోజకవర్గాలలో టిడిపికి బలమైన అభ్యర్ధులున్నారు. టికెట్ ఆశిస్తున్నారు. కనుక ఆ నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ వదులుకొంటారా లేక కోరుకోబోతున్నారా?అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రెండు పార్టీలు చర్చించుకొని నిర్ణయించుకొన్నాకనే తెలుస్తుంది.
మరి ఏపీలో నెలకొన్న ఈ రాజకీయ గందరగోళం ఇంకా ఎంతకాలం కొంసాగుతుందో? ఏవిదంగా ముగుస్తుందో?





