మరో రెండు… కొడితే కేకే మరి..!

women World Cup, India Vs New Zealandఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి న్యూజిలాండ్ పై జయకేతనం ఎగురవేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, కెప్టెన్ మిథాలీ రాజ్ (123 బంతుల్లో 109 పరుగుల) అద్భుతమైన సెంచరీతో, నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. మిథాలీకి అండగా, కౌర్ 60, చివర్లో కృష్ణమూర్తి 45 బంతుల్లో 70 పరుగులతో మెరుపులు మెరిపించింది.

ఇక భారీ లక్ష్య చేధనలో రెండవ ఓవర్ నుండి మొదలైన వికెట్ల పతనం 79 పరుగుల వద్ద పదవ వికెట్ తో ముగిసింది. కేవలం ముగ్గురు మాత్రమే రెండెంకల స్కోర్ ను అందుకోగా, భారత బౌలర్లలో గైక్వాడ్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు నేలకూల్చి కివీస్ పతనాన్ని శాసించింది. సూపర్ సెంచరీతో భారత విజయానికి కారణమైన మిథాలీకి ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, ఈ విజయంతో పాయింట్ల పట్టికలో (7 మ్యాచ్ లలో 5 విజయాలు దక్కించుకుని) మూడవ స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT

దీంతో సెమీ ఫైనల్స్ లో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడాల్సి ఉంది. లీగ్ మ్యాచ్ లలో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన టీమిండియా, ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో (జూలై 20వ తేదీన) విజయం సాధించాలంటే ప్రతిభకు మించిన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. మరో సెమీ ఫైనల్ లో తొలి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు నాలుగవ స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాతో (జూలై 18వ తేదీన) తలపడనుంది. మరో రెండు మ్యాచ్ లలో అద్భుతమైన ఆటతీరును ఏ జట్టు అయితే ప్రదర్శిస్తుందో, వరల్డ్ కప్ ఆ జట్టు వశమే అవుతుంది.

ఇదిలా ఉంటే, ఈ ప్రపంచ కప్ లో ఆడిన 7 మ్యాచ్ లలోనూ ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేక ‘0’ పాయింట్లతో అట్టడుగున నిలిచింది పాకిస్తాన్ జట్టు. అలాగే శ్రీలంక ఒక విజయం సాధించి 7వ స్థానంలోనూ, విండీస్ 2 విజయాలతో 6వ స్థానంలోనూ, న్యూజిలాండ్ 3 విజయాలతో 5వ స్థానంలోనూ నిలిచాయి. అలాగే దక్షిణాఫ్రికా 4 విజయాలతో, టీమిండియా 5 విజయాలతో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు 6 విజయాలతో ఉండడం విశేషం. కింద నుండి లెక్కేస్తే… పాకిస్తాన్ ‘0’ టు ఇంగ్లాండ్ ‘6’ సంఖ్య కనపడుతుండడం గమనించదగ్గ విషయం.

ADVERTISEMENT
Latest Stories