ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ (ఏఐ) చేస్తున్న అద్భుతాల గురించి రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఏఐతో ఓ సినిమాయే తీసి రిలీజ్ చేశారు. అదీ మన దేశంలోనే… పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనే..
అదే.. ఇటీవల విడుదలైన కన్నడ సినిమా లవ్ యూ. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో సహా మొత్తం 15 మంది నటీనటులున్నారు.
అనేక లొకేషన్స్లో ఈ సినిమా కధ సాగింది. అన్ని సినిమాల మాదిరిగానే దీనిలో కూడా పాటలు, డాన్సులు, ఫైట్స్ అన్నీ ఉన్నాయి.
కానీ వాటిని ఏ కెమెరాతో చిత్రీకరించలేదు. ఏ లొకేషన్కి వెళ్ళి షూటింగ్ జరుపలేదు. ఈ సినిమాలో ఏ ఒక్కరూ నటించలేదు. ఎవరూ సంగీతం సమకూర్చలేదు.
బెంగళూరు సమీపంలో సిద్దేహళ్ళి గ్రామానికి చెందిన నరసింహమూర్తి అనే వ్యక్తి, గ్రాఫిక్ డిజైనర్గా చేస్తున్న నూతన్ అనే వ్యక్తితో కలిసి ఈ తొలి ఏఐ సినిమా తీశారు.
దీని కోసం వారు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. దానిలో ఎక్కువ భాగం ఏఐ సాఫ్ట్ వేర్, లైసెన్సుల కొనుగోలు కోసమే ఉపయోగించామని చెప్పారు.
వారిద్దరూ కలిసి ఏఐ సాయంతో కధ, డైలాగ్స్, పాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, సంగీతంతో సహా అన్నీ పూర్తి చేశారు. ఇది తమకు తొలి సినిమా కనుక, అన్నీ సమకూర్చుకొని పూర్తి చేసేందుకు ఆరు నెలలు సమయం పట్టిందని, కానీ ఇకపై ఒకటి రెండు నెలలలోనే సినిమా పూర్తిచేయగలమని నరసింహ మూర్తి, నూతన్ చెప్పారు.
కనుక ఇకపై నిర్మాతలకి హీరో హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎవరూ అవసరం ఉండదు. కెమెరాలు, స్టూడియోలు, భారీ సెట్స్, అవుట్ డోర్ షూటింగ్, వాటి కోసం కోట్ల రూపాయల ఖర్చు కూడా ఉండదు.
ఓ ఏఐ సంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓ కంప్యూటర్ ఒకటి ఉంటే చాలు. దానికి దర్శకుడు లేదా నిర్మాత లేదా సినిమాలు తీయాలనుకుంటున్న వారు ఎవరైనా తాము అనుకున్న పాయింట్స్ చెప్పి దాంతో ఓ కధ సిద్దం చేయమని చెపితే అది సిద్దం చేస్తుంది.
దానికి తగిన పాత్రలు సూచిస్తే అదే ఎంపిక చేసుకుంటుంది. పాటలు, డైలాగ్స్, సంగీతం, ఫైట్స్, సెట్టింగ్స్, లొకేషన్స్ సూచిస్తే అదే వాటిని తయారు చేసుకుంటుంది.
ఇలా అన్ని వివరాలతో ఏఐకి ఓ సినిమా తీసి పెట్టమని కమాండ్ ఇస్తే చాలు.. రాబోయే రోజుల్లో బహుశః కొన్ని గంటల వ్యవధిలోనే సినిమా కాపీ చేతికి ఇచ్చేస్తుందేమో?
ఇందుకు సంతోషించాలో లేదా సినీ పరిశ్రమపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునపడే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందాలో తెలీని పరిస్థితి. ఈ సినిమాపై సినీ పరిశ్రమలో వారు ఇంకా స్పందించాల్సి ఉంది.




