ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పధకాలను జగనన్న లేదా వైఎస్సార్ పేర్లతో అమలుచేస్తుండటం అందరికీ తెలిసిందే. కనుక అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పధకాలే అనే భావన ప్రజలలో కలిగిస్తోంది. సిఎం జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అలాగే చెప్పుకొంటున్నారు.
అయితే వాటిలో చాలా పధకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని, కానీ వైసీపి ప్రభుత్వం ఎక్కడా ప్రధాని నరేంద్రమోడీ ఫోటో, పేరు పెట్టడం లేదని ఏపీ బీజేపీ నేతలు తరచూ ఆరోపిస్తుంటారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రోజ్గార్ యోజన వంటి అనేక పధకాలను అమలుచేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అవి యాధాతధంగా అమలవుతుంటాయి. కానీ మిగిలిన రాష్ట్రాలలో ప్రభుత్వాలు వాటికి తమ సొంత పేర్లు తగిలించుకొని తమ సొంత పధకాలుగా ప్రచారం చేసుకొంటున్నాయి. ఇది ఆ పార్టీలకు సంబందించిన విషయం. కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం.
కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తున్న పధకాల పేరు మార్చి సొంత పధకాలుగా చెప్పుకొంటూ ఆయా రాష్ట్రాలలో అధికార పార్టీలు రాజకీయ మైలేజీ పొందుతున్నాయి. కానీ ఆ పధకాల పేర్లు మార్చినందుకు కేంద్ర ప్రభుత్వం వాటికి చెల్లించాల్సిన నిధులను నిలిపివేస్తుండటమో లేదా కొర్రీలు వేస్తూ నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేస్తుందటమో జరుగుతుందనే విషయం బయటకు చెప్పవు.
రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పధకాలకు పేర్లు మార్చడం వలన చాలా నష్టం జరుగుతోందని టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. దీని వలన రాష్ట్రానికి రావలసిన వేలకోట్ల నిధులు రాకుండా నిలిచిపోవడమో లేదా మురిగిపోవడమో జరుగుతోందని అన్నారు. టిడిపి హయాంలో కూడా అనేక పధకాలను అమలుచేశామని, కానీ కేంద్ర ప్రభుత్వ పధకాలను యధాతధంగా కొనసాగించామని చెప్పారు.
ఈ నేపధ్యంలో పార్టీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?అంటే వైసీపి ప్రభుత్వానికి పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అందుకే సంక్షేమ పధకాలను జగన్, వైఎస్సార్ పేర్లతో బ్రాండింగ్ చేస్తూ, వాటిని చూపి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం పధకాల ద్వారా రావలసిన నిధులను వదులుకొని రాష్ట్రానికి నష్టం కలిగిస్తూనే, సంక్షేమ పధకాలతో ప్రతీ ఇంటికీ మేలు చేస్తున్నామంటూ ఊరూరూ తిరగడం వైసీపి నేతలకే చెల్లునేమో?






