ఇప్పటి రాజకీయ ఫార్ములాని హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు చేసిన వారికి కూడా వర్తింపజేస్తే అందరూ నిర్దోషులుగా బయటపడగలరు.
అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు, గోదాములో రేషన్ బియ్యం దొంగతనం కేసు, టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడులు ఇంకా అనేక ఇతర కేసులలో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైసీపీ నేతలు, తాము అమాయకులమని, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కక్షతోనే తమని వేదిస్తున్నారని చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.
కనుక ఇదే ఫార్ములాని ఇతర నేరస్థులకు కూడా అన్వయించి చూస్తే వారు కూడా అన్యాయంగా జైలు పాలయిన్నట్లే కదా?
వైసీపీ నేతలు తమపై నమోదవుతున్న కేసులకి ఓ విరుగుడు ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. ముందస్తు బెయిల్ దొరికేవరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం లేదా కేసు నమోదవుతుందని ఏమాత్రం అనుమానమున్నా ముందుగానే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం.
చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నేడు విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆయన కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునందున సీఐడీ పోలీసులు తనను ప్రశ్నించి పంపడం తప్ప మరేమీ చేయలేరని జోగి రమేష్కి ధైర్యం ఉంది. కనుకనే ధైర్యంగా హాజరవుతున్నారు.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు ఇంటి ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం తప్పా? దానికీ నాపై తప్పుడు కేసు పెట్టి వేదిస్తారా?” అని ప్రశ్నించారు.
టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించిన వైసీపీ నేతలు, శాంతియుతంగా నిరసనలు చేస్తారంటే నమ్మశక్యంగా ఉంటుందా?ఒకవేళ నిజంగానే జోగి రమేష్, అనుచరులు శాంతియుతంగా ధర్నా చేసి ఉంటే, ఆయనపై కేసు పెట్టినందుకు పోలీసులే కోర్టులో సంజాయిషీ ఇచ్చుకొని మొట్టి కాయలు వేయించుకోవలసి వస్తుంది కదా?
ఆనాడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు జోగి రమేష్, అనుచరులతో చేసిన హడావుడి మీడియా రికార్డులలో ఉంది. కనుక రాజకీయ వేధింపులు పేరుతో తప్పించుకోలేరు.
ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టేందుకు జోగి రమేష్ ప్రయత్నించడం గమనిస్తే వైసీపీ నేతల ధోరణి ఏవిదంగా ఉంటుందో అర్దం చేసుకోవచ్చు. ఇంతకీ సీఐడీ పోలీసులు ఈ కేసు విచారణ ఇంకా ఎప్పటికీ ముగిస్తారో?




