మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకు తాజాగా వైసీపీ నేతలు బాబు కుటుంబసభ్యుల మీద చేసిన విమర్శలు అగ్గికి ఆజ్యంపోసినట్టు అయ్యాయి. బాబూ ఆరోగ్యం పట్ల సర్వత్రా ఆందోళన నెలకొన్న సందర్భంలో వైసీపీ నేతల రాజకీయ విమర్శలు మానవతా విలువలకే తిరోధకలిచ్చేలా ఉన్నాయంటూ పలు విమర్శలను మూటకట్టుకున్నాయి.
బాబు చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వం ఆయన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుందంటూ, బాబుకు ఏమైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత జగన్ ప్రభుత్వానిదే అంటూ బాబు కుటుంబసభ్యులైనా భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్…,ఇతర కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైనంలో వైసీపీ ఎవ్వరి ఊహకు అందని సరి కొత్త, కొత్త అనడం కంటే చెత్త రాజకీయ వ్యూహంతో ముందుకొచ్చిందని చెప్పాలి.
వైసీపీ పార్టీలో మానవతా విలువలు మరిచిపోయి మరీ రాజకీయాలు చేస్తారు అని ఇప్పటికే చాల మంది నాయకులు, మంత్రులు ఎన్నోసార్లు రుజువుచేసుకున్నారు ఇప్పటికి చేసుకొంటునే ఉన్నారనుకోండి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో తమ స్థానాన్ని నిలుపుకోవడానికి పోటీపడుతున్నారు మాజీ మంత్రి ప్రస్తుత డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వెళ్ళం పల్లి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ.
చంద్రబాబుని చంపితే ఆయన భార్య భువనేశ్వరినే చంపుతారని,తన తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని బాబు హస్తగతం చేసుకున్నప్పుడు కానీ, ఎన్టీఆర్ ను సీఎం పదవి నుండి తప్పించినప్పుడు కానీ భువనేశ్వరి మోనంగానే ఉండిపోయారు. అలాగే ఇప్పుడు బాబు చనిపోతే ఆమె కొడుకు లోకేష్ కు ఉన్నా పదవి కాంక్ష పూర్తవుతుందని బాబుకి పంపే ఆహారంలో భువనేశ్వరినే ఏమైనా కలిపే ప్రమాదం లేకపోలేదు అంటూ నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో మానవత్వ విలువలు ఇంతలా చచ్చిపోయాయా? అన్న సందేహం కలుగక మానదు.
అలాగే మంత్రి కొట్టు సత్యనారాయణ., పోసాని కృష్ణ మురళి కూడా చంద్రబాబు కు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఆయన కుటుంబసభ్యులే అంటూ ఇదే తరహా విమర్శలు చేయడం తో వైసీపీ నేతలు తమకు అలవాటైన డైవర్షన్ పొలటిక్స్ మొదలు పెట్టారంటూ పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. తన తండ్రి వైస్సార్ చావుకు కారణం వీరే అంటూ అప్పట్లో విమర్శలు చేసి ఇప్పుడు వారికీ సంబందించిన వ్యక్తుల కే రాజ్యసభ సీట్లు ఇవ్వడం,సొంత బాబాయిని గొడ్డలి పోటుతో అంతమొందించడం తమకు తెలియదని, అటువంటి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ నేతల విమర్శల మీద ఎదురుదాడి చేస్తున్నారు.
వెల్లంపల్లి అందరు బాబు కుటుంబాన్నే విమర్శిస్తే కిక్కు ఏముంటది అనుకున్నారో ఏమోకానీ ఈయన మరో వాదన తలకెత్తుకొచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చనిపోతారు, టీడీపీ పార్టీని ఎప్పుడు జనసేనలోకి విలీనం చూసేద్దామా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు అంటూ రెచ్చిపోయారు.వైసీపీ నేతల ఈ రాజకీయ విమర్శలు చూస్తుంటే ప్రతిపక్ష నేత చావు మీద వైసీపీ పార్టీ రాజకీయ చేస్తుందా? లేక ప్రతిపక్ష నేత చావు కోసం రాజకీయం మొదలుపెట్టిందా?అన్న సందేహం అటు ప్రతిపక్ష పార్టీలనే కాదు సామాన్యులను సైతం వెంటాడుతుంది.
జైల్లో రిమాండ్ లో ఉన్నా చంద్రబాబుకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆయన ఆరోగ్యం పట్ల పూర్తి భద్రత వహించాల్సింది ప్రభుత్వమే. అలాకాకుండా బాబుకు ఏదైనా జరిగితే…, జరిగితే…,అంటూ ప్రభుత్వమే పదే పదే చెప్పడం అక్కడితో ఆగకుండా దానికి బాధ్యత ఆయన భార్యదే అంటూ దిగజారుడు మాటలు మాట్లాడడం ఒక్క వైసీపీ పార్టీకే సాధ్యం. ఎందుకంటే తండ్రి చావు మీద పుట్టిన పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆలా చంపడాలు, చావడాలు వారికీ తెలిసినట్టు తమ పార్టీకి తెలియదని టీడీపీ తమ్ముళ్లు కూడా వైసీపీ నేతలకు కౌంటర్ ఎటాక్ సిద్ధం చేశారు.
రాజకీయ పార్టీలు తమ గెలుపుకు వ్యూహాలు రచించడం, ఎత్తుకు పైఎత్తు వేయడం, ప్రత్యర్థులను తమ రాజకీయ విమర్శలతో కట్టడి చేయడం తప్పు కానేకాదు. కానీ ఇలా తమ ప్రత్యర్థులను మానసికంగా హింసించడం, ప్రతిపక్ష పార్టీల నేతల ప్రాణాల మీద, రాజకీయాలతో సంబంధం లేని కుటుంబసభ్యులను తమ రాజకీయ స్వలాభం కోసం రోడ్డు మీదకు లాగి రాజకీయాలు చేయాలనుకోడం మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఒక వ్యక్తిని తన రాజకీయ చాణుక్యంతో పడగొట్టి పదవి పొందాలే కానీ అతని ప్రాణాలు తీసి తమ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకోవడం ఎంతవరకు సమంజసమో వైసీపీ నేతల విజ్ఞతకే విడిచిపెట్టాలి.




