మన న్యాయ, దర్యాప్తు వ్యవస్థలపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ ప్రభావాలు ఉండవని అందరూ చెప్పుకొంటారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుందనే’ రాజకీయనాయకుల నోట తరచూ వినిపించే మాట సినిమా డైలాగ్లాగ చాలా పాపులర్ అయిపోయింది.
కానీ కొన్ని కేసులను నిశితంగా గమనిస్తే మన న్యాయవస్థలపై రాజకీయ ప్రభావం చాలా ఉందనే అర్దమవుతోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డిని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితని సీబీఐ, ఈడీలు సీబీఐ కనీసం విచారణకు రప్పించలేవు. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి జోలికి ఈడి, సీబీఐలు వెళ్ళవు. అందుకు ఎవరు ఎక్కడ ఏవిదంగా చక్రం తిప్పుతున్నారో అందరికీ తెలుసు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డికి, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ లభిస్తుంది. కానీ అదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించదు.
వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ లభించింది. కానీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం నమోదు చేస్తున్న ఏ కేసుల్లోను ఆయనకు ఏ కోర్టులోనూ ఉపశమనం లభించడం లేదు. కోడికత్తి కేసులో గత 5 ఏళ్ళుగా రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గుతున్న శ్రీనివాస్కు బెయిల్ లభించడం లేదు. కానీ కాకినాడలో దళిత యువకుడుని అతికిరాతకంగా హత్య చేసిన వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబుకి కూడా బెయిల్ లభిస్తుంది.
న్యాయం, చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కానీ ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలాగా ఉంటోంది. ఈ కేసులన్నీ కలిపి చూస్తే మన న్యాయ, దర్యాప్తు వ్యవస్థలపై రాజకీయ ప్రభావం లేదని ఎలా చెప్పగలము?





