మూడు రాజధానులు… అంతా మన మంచికే

Vizag Rushikonda Palace

అమరావతిని రాజధానిగా అంగీకరించని జగన్‌ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినా మూడు రాజధానులు కూడా ఏర్పాటు చేయలేక చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. రాజధాని లేకుండా చేయడం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని బహుశః అంచనా వేయడం కష్టమేనేమో?

ఆ నష్టాన్ని పక్కన పెట్టి చూస్తే, జగన్‌ అమరావతిలో వేలు పెట్టకపోవడం వలన, మూడు రాజధానులను ఏర్పాటు చేయలేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చాలా మేలే జరిగిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

ఒకవేళ జగన్‌ అమరావతిని రాజధానిగా అంగీకరించి ఉంటే, చంద్రబాబు నాయుడు సిద్దం చేసిన ప్రణాళిక, డిజైన్స్ ప్రకారం నిర్మాణ పనులు జరగనిచ్చేవారు. ఆ మార్పుల కోసమే వేలకోట్లు ఖర్చు పెట్టేసేవారు. ఆయన విశాఖ రాజధాని చేయాలనుకుంటేనే వందల కోట్లు ఖర్చు పెటేసి ఋషికొండని చెక్కించేసి దానిపై విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. అదే అమరావతి నిర్మాణానికి పూనికొని ఉండి ఉంటే?

అధికారంలో లేనప్పుడే లక్ష కోట్ల అవినీతికి పాల్పడి అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడా జైలుకి వెళ్ళి వచ్చిన జగన్‌, ముఖ్యమంత్రిగా అమరావతి నిర్మాణ పనులు కొనసాగించి ఉండి ఉంటే అవినీతికి పాల్పడకుండా ఉండేవారా?అంటే కాదనే భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అదృష్టం కొద్దీ ఆయన అమరావతిని వద్దనుకున్నారు.

ఒకవేళ జగన్‌ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చట్టపరమైన సమస్యలన్నిటినీ అధిగమించి విశాఖని రాజధానిగా చేసి ఉంటే, ఇప్పుడు మళ్ళీ అమరావతికి మార్చుకోవడం ప్రభుత్వానికి న్యాయపరంగా, రాజకీయంగా కూడా చాలా కష్టంగా మారి ఉండేది. మళ్ళీ రాజధానిని అమరావతికి మార్చుకోవడానికి న్యాయ, రాజకీయ పోరాటాలతో 5 ఏళ్ళు గడిచిపోయి ఉండేది.

ఇదివరకు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఫైల్స్, ఫర్నీచర్, అధికారులు, ఉద్యోగులను అమరావతి రప్పించడానికి చంద్రబాబు నాయుడు ఎన్ని తిప్పలు పడ్డారో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకవేళ జగన్‌ విశాఖని రాజధానిగా చేసి ఉంటే మళ్ళీ అదేవిదంగా అన్నీ విశాఖ నుంచి అమరావతికి తరలించాల్సి వచ్చేది. ఈ మార్పు ప్రభుత్వానికి పెనుభారంగా మారి ఉండేది. పైగా జగన్‌, వైసీపి నేతలు ఉత్తరాంధ్రా జిల్లా ప్రజలలో సెంటిమెంట్ రగిలిస్తే ప్రాంతీయ విభేధాలు ఏర్పడి ఉండేవి.

ఒకవేళ జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి విశాఖ రాజధాని పేరుతో మరో 5 ఏళ్ళు కాలక్షేపం చేసినా రాష్ట్రానికి ఇంకా నష్టం జరిగి ఉండేది.

కనుక జగన్‌ ఏ కారణంగా విశాఖని రాజధాని చేయలేకపోయినా, ఆయన వైఫల్యం, ఓటమి రెండూ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందనే భావించవచ్చు.

చివరిగా ఒక మాట: నాడు తాము విశాఖ రాజధాని చేస్తుంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని వాదిస్తూ, ఊహాజనితమైన విశాఖా రాజధాని కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు విశాఖలో నిరసన యాత్ర కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్మిస్తుంటే జగన్‌, వైసీపి నేతలు అడ్డుపడగలరా?అమరావతిని వద్దని ఏ కోర్టు అయినా అభ్యంతరం చెపుతోందా? లేదే?ఎందువల్ల?ఆలోచిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories