జగనన్నకు ఏం చెపుదాం… ఎన్నని చెపుదాం?

YS Jagan Andhra Pradesh Crops Loss Damaged Roadsఏపీ ప్రభుత్వం నేటి నుంచి ‘జగనన్నకు చెపుదాం’అనే కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీనిలో ప్రజలు తమ సమస్యలను 1902 నంబరుకు కాల్ చేసి చెప్పిన్నట్లయితే, వాటిని సిఎం జగన్మోహన్ రెడ్డి పరిష్కారిస్తారు. ప్రతీ సోమవారం వివిద శాఖల అధికారులు ప్రజా స్పందన కార్యక్రమం నిర్వహిస్తు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తుంటారు. దానికి కొనసాగింపే ఈ కార్యక్రమం.

ప్రజలు 1902 నంబరుకి ఫోన్‌ కాల్, ఎస్ఎంఎస్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం మంచి ఆలోచనే. అయితే అటు నెల్లూరు, చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు సమస్యలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా వాటిలో ఒక్క శాతం పూర్తిచేయగలిగినా సంతోషమే.

ADVERTISEMENT

అకాల వర్షాలతో రైతన్నలు పంటలు నష్టపోయి కన్నీళ్ళు పెట్టుకొంటున్నారు. కనుక ముందుగా వారందరికీ నష్టపరిహారం చెల్లించి, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏలూరు జిల్లా నాచుగుంటలో రైతులను పరామర్శించడానికి వెళ్ళిన పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వర రావు ఓ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “ఒరేయ్ ఎర్రిపప్ప నోరు మూసుకో…” అని వార్నింగ్ ఇచ్చారు. అంటే రైతుల నోరు మూయించడమే ఆ సమస్యకు పరిష్కారం అనుకోవాలన్న మాట!

భారీగా పెంచిన ఆస్తిపన్ను, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఎప్పటికప్పుడు పన్నులు, ఛార్జీలు పెంచేస్తున్నా రాష్ట్రంలో గుంతపడ్డ రోడ్లను మరమత్తులు చేయడం లేదు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ వంతెన కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు విశాఖ, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్‌, అటు ఒడిశా నుంచి రోజూ వందాలది బస్సులు వస్తుంటాయి. కానీ చిన్నపాటి వర్షం వస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో మోకాలిలోతు నీళ్ళు చేరిపోతుంటాయి. ఈ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడో మంజూరు అయిన వంతెన, కాలువల నిర్మాణం కోసం వైసీపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు నెలలుగా ధర్నాలు చేస్తూనే ఉన్నారు. వాటిని పరిష్కరించవచ్చు. రాజధాని కాబోతున్న విశాఖ నగరంలో రోడ్లపై లైట్లు వెలగడం లేదు. విశాఖలోనే ఇలా ఉంటే ఇక మిగిలిన జిల్లాలలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి బిల్లులు చెల్లిస్తే మళ్ళీ పనులు మొదలుపెడతారు.

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు దాదాపు మూడు వారాలుగా తమ డిమాండ్స్ పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కనీసం నెలనెలా ఒకటో తారీకున జీతాలు చెల్లించాలని వేడుకొంటున్నారు.

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రాకపోవడం వలన నిరుద్యోగులు హైదరాబాద్‌, బెంగళూరు వలసలు వెళ్ళాల్సివస్తోంది. కనుక వారికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. అంతవరకు తమకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చెప్పుకొంటూపోతే ఏడాది పొడవునా జగనన్నకు చెప్పుకొన్నా తీర్చలేనన్ని సమస్యలు ప్రభుత్వం చుట్టూ కొండల్లా పేరుకుపోయాయి. కళ్లెదుట ఇన్ని సమస్యలు కనిపిస్తున్నప్పుడు మళ్ళీ ‘జగనన్నకు చెపుదాం’ అంటే ప్రజలను కెలకడమే అవుతుంది. ఎందుకంటే వాటిలో ఒక్క శాతం కూడా పరిష్కరించలేదు కనుక!

ఒకవేళ వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించేయాలనే చిత్తశుద్ధి, తాపత్రయం ఉన్నట్లయితే ఇన్ని సమస్యలు ఉండేవే కావు కదా? కానీ ఇప్పుడు జగనన్న మంత్రదండం తిప్పి అన్నిటినీ పరిష్కరించేస్తారని చెపుతోంది కనుక ఈ కొద్దిపాటి సమస్యలనే సుమోటుగా స్వీకరించచి పరిష్కరించేయవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories