వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ధోరణి మొదటి నుంచే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ, ఏపీ రాజకీయాలలోకి ఆయన సోదరి వైఎస్ షర్మిల ప్రవేశించిన తర్వాత మరింత విచిత్రంగా మారిన్నట్లు కనిపిస్తోంది.
బాబాయ్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని చెలెళ్ళు షర్మిల, సునీతా ఇద్దరూ నిలదీస్తుంటే వారిద్దరి చేత చంద్రబాబు నాయుడే అలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. చెల్లి పసుపు రంగు చీర కట్టుకుంటే దానిపై కూడా జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చెల్లెళ్ళపై పగబట్టిన్నట్లు వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి రెడ్డిని మాత్రం తమ్ముడూ తమ్ముడూ అంటూ నోరారా పిలుస్తూ, ఆయనను గెలిపించుకోవడానికి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
తాజాగా వైఎస్ షర్మిలపై కడప జిల్లా, బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తన అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించినందుకు కేసు నమోదు చేసి ఉండి ఉంటే, ఎన్నికలలో ఇది సహజమే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆమె వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడినందుకు పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. కడప జిల్లా కోర్టు ఈ అంశం గురించి ఎన్నికలలో మాట్లాడరాదని ఆంక్ష విధించింది. కానీ ఆమె మాట్లాడారు కనుక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారట!
ముఖ్యమంత్రికి తెలియకుండా, అనుమతి లేకుండా ఆయన చెల్లెలుపై పోలీసులు కేసు నమోదు చేయరు. కనుక ఇది ఆయనకు తెలిసే జరిగిందని భావించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో జగన్ ప్రతిష్ట చాలా మసకబారింది. ఆమె పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న ఈ తీరుని రాష్ట్ర ప్రజలు తప్పు పడుతున్నారు కూడా. కనుక ఇప్పుడు ఆమెపై పోలీస్ కేసు నమోదు చేయడం ద్వారా ప్రజలకు మరింత తప్పుడు సంకేతాలు పంపిన్నట్లు అవుతుందనే విషయం వైసీపి మేధావులు గ్రహించిన్నట్లు లేదు.
“ఏ అన్నైనా చెల్లి ఇంటికి వస్తే బట్టలు పెడతాడు. కానీ మా అన్న మాత్రం సొంత చెల్లి అని కూడా చూడకుండా ఇలా పోలీస్ కేసు నమోదు చేయిస్తాడు,” అని షర్మిల చెప్పుకోకుండా ఉండరు. అప్పుడు కడప ప్రజలలో ఆమె పట్ల మరింత సానుభూతి పెరుగుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఇవన్నీ నిశితంగానే గమనిస్తున్నారు. కనుక ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపిపై పడకుండా ఉండదు.
ఇది జగన్-షర్మిల మద్య జరుగుతున్న రాజకీయ యుద్దమే అయినా దీని ప్రభావం వైసీపి అభ్యర్ధులందరిపై పడుతుంది. అంటే జగన్ సంక్షేమ పధకాల ‘మేలు’తో అందరూ లాభపడాలని అందరూ ఆశపడుతుంటే, జగన్ ధోరణి వలన అందరూ నష్టపోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టమవుతోంది.
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఈవిదంగా చేస్తూ మిగిలిన దారిని తనంతట తానే మూసేసుకుంటున్నారు అని చెప్పక తప్పదు.




