గత యూపీఐ ప్రభుత్వంలో సీబీఐ మీద తీవ్ర విమర్శలు చేస్తూ… తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, తన నిజాయితీ ఏంటో నిరూపణ అవుతుందని, సీబీఐ అసలు ఎలా వ్యవహరిస్తోంది అంటే… ఇది ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ కానే కాదు, ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని ఓ రేంజ్ లో సీబీఐ మీద మండిపడిన జగన్ వ్యాఖ్యలు బహుశా రాజకీయ విజ్ఞులకు గుర్తుండే ఉంటాయి. ఇదే భావన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో వినియోగించారు వైసీపీ అధినేత.
అయితే ఇప్పుడు అదే సీబీఐపై ప్రేమ ఒలకబోస్తున్నారు. అంతేకాదు, ఒక్క సీబీఐ మాత్రమే నిజాలను బయటకు తీసుకువస్తుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ పై స్పందించిన జగన్, “మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఈ కేసును చిన్న అధికారులపైకి, అటెండర్లపైకి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అంశంలో సీబీఐతో విచారణ జరిపించాలని, అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని” రాష్ట్ర సర్కార్ ను డిమాండ్ చేసారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పిన ప్రకారం, ఓ అటెండర్ ఫోన్ ద్వారా ప్రశ్న పత్రం లీక్ అయిందని అంటున్నారని, అయితే ఆ అటెండర్ ఏ కాలేజీకి చెందిన వాడో అందరికీ తెలుసని, ఆ కాలేజీ ఎవరిదో ఎఫ్ఐఆర్ కాపీ కూడా చెబుతుందని, ఇలా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించబోరని జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసారు. జగన్ ఇలాంటి డిమాండ్ చేయడంలో తప్పులేదు, నిజానికి ఇలాంటి విషయాలను రాజకీయాలకు వినియోగించుకోకుండా ప్రతిపక్షం గట్టిగా పోరాడాలి కూడా!
కానీ, తన వరకు వచ్చేసరికి సీబీఐ అన్యాయం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మాత్రం సీబీఐ ఒక్కటే నిజాలను బయటకు తెస్తుందని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ సీబీఐ మీద నిజంగా జగన్ కు అంత నమ్మకమే ఉంటే, ఇప్పటివరకు తనపై సీబీఐ నమోదు చేసిన కేసులన్నీ కూడా నిజమేనని ఒప్పుకుంటారా? అలాగే తాజాగా సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ కు కూడా జగన్ సహకరిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. బహుశా ఇందుకు జగన్ అంగీకరిస్తే… రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తుందేమో!?



