తాము ఉత్పత్తి చేసిన పవన విద్యుత్తును తీసుకునేందుకు ఏపీ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), సర్కారు నిరాకరిస్తున్నాయని కొన్ని ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. ఇప్పటికే పీపీఏలు సమీక్షించే నిమిత్తం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ జారీచేసిన జీవో 63 గతంలో హైకోర్టు నాలుగు వారాలు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రభుత్వం ఈ విషయంలో మనసు మార్చుకోకుండా మరిన్ని కంపెనీల నుండి విద్యుత్తు కొనుగోలు ఆపేసింది.
రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా తాము విద్యుత్తు తీసుకోమని మౌఖికంగా కంపెనీలకు చెప్పినట్టు సమాచారం. విద్యుత్ తీసుకోవడానికి నిరాకరించిన సందర్భాలు, విద్యుత్తు డిమాండ్ వివరాలు, గ్రిడ్ భద్రతపై పూర్తి వివరాల్ని సమర్పించాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ప్రాధమికంగా ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించడం విశేషం.
అయితే ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ తెలివిగా వాదనలు వినిపించారు. వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ తగ్గిందని, బకాయిలు చెల్లించే విషయంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేస్తామని తెలిపారు. కంపెనీలకు అభ్యంతరాలుంటే ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ని ఆశ్రయించాలే గానీ హైకోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. అయితే డిమాండ్ తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ లోని అనేక చోట్ల ఇప్పటికీ కరెంటు కోతలు అమలు చెయ్యడం విశేషం.



