ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదాను సాధించేది నేనే… అవసరమైతే కేంద్రం మెడలు, తొడలు వొంచి నేను తీసుకువస్తా… అంటూ మొన్నటివరకు మైక్ లలో ఊదరగొట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి… అత్యంత కీలకమైన ఈ అంశంపై వైసీపీ ప్లీనరీలో కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ప్రస్తుతం రాజకీయాలలో హాట్ హాట్ గా హల్చల్ చేస్తున్న విషయం. అయితే దీనికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు… బిజెపితో జగన్ కుదుర్చుకున్న ఒప్పందమేనన్న ప్రచారం బలంగా జరుగుతోంది.
కేంద్రం పరిధిలో ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన జగన్, ఇక అదే అంశాన్ని ప్రస్తావిస్తే… ఖచ్చితంగా ఏదొక సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. ఇంకా లోతుకు వెళితే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే… ప్రస్తుతం తనున్న పరిస్థితుల నుండి బయటపడే అవకాశం లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన చేసిన సందర్భంలో కూడా ఇదే హైలైట్ అయ్యింది. బిజెపితో జగన్ లాలూచీ పడ్డారని రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ తెలియనిది కాదు. తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీ దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ అనేది ‘సంజీవని’ అని బల్లగుద్ది మరీ చెప్పిన జగన్, ఇపుడు అదే ‘సంజీవని’ అంశం కనీసం ప్రస్తావించకపోవడం అనేది ఎలా చూడాలో… వైసీపీ వర్గాలే సెలవివ్వాలి. ఫైనల్ గా ప్రజలకు తేలిన విషయం ఏమిటంటే… స్వార్ధ రాజకీయ ప్రయోజనాల ముందు ప్రజా ప్రయోజనం వెంట్రుక వాసి అని..!



