జగన్‌ ఢిల్లీకి… ఈసారి అన్నీ ఫైనల్?

Ys Jagan Modiటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన దాదాపు నాలుగు వారాల తర్వాత ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలువబోతున్నారు. వారిరువురు మౌనం వహించడం ద్వారా టిడిపి పట్ల తమ వైఖరిని తేల్చి చెప్పేశారనే భావించవచ్చు.

నారా లోకేశ్‌తో సహా పలువురు టిడిపి నేతలపై కేసులు నమోదు చేసి అందరినీ జైలుకి పంపించేందుకు వైసీపి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులే స్వయంగా చెప్పేశారు. పవన్‌ కళ్యాణ్‌ బీజేపీని వదులుకొని టిడిపితో కలిసి పనిచేసేందుకు సిద్దపడ్డారు.

ADVERTISEMENT

కేవలం మూడు వారాల వ్యవధిలో ఏపీలో ఇన్ని అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మోడీ, అమిత్ షాలను కలువబోతుండటం చాలా ప్రాధాన్యతను సంతరించుకొంది.

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో ఏర్పడిన రాజకీయ ఉప్పెన క్రమంగా చల్లారుతోంది. కనుక ఇప్పుడు జగన్‌తో భేటీ అయినా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన్నట్లు ఉండదని మోడీ, అమిత్ షాలు భావించి ఉండవచ్చు.

కనుక ఈ భేటీలో వైసీపి తదుపరి కార్యాచరణ గురించి చర్చించవచ్చు. అయితే అమిత్ షా, జేపీ నడ్డాలు ఇదివరకు ఏపీకి వచ్చినప్పుడు, కొత్తగా బీజేపీ పగ్గాలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసినందున, ఇప్పుడు వైసీపితో పొత్తులు పెట్టుకోలేదు. ఒకవేళ పెట్టుకొంటే మైనార్టీ ఓటు బ్యాంక్ టిడిపి కూటమి వైపు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

ఒకవేళ జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నట్లయితే అందుకు మోడీ అనుమతి తప్పనిసరి. అందుకు ఆయన అంగీకరిస్తే కేంద్రం నుంచి వైసీపి ఎటువంటి తోడ్పాటు ఆశిస్తోంది?అందుకు ప్రతిగా ఏపీ బీజేపీకి ఏవిదంగా మేలు చేకూర్చుతుంది? టిడిపి, జనసేనలను ఏవిదంగా మరింత కట్టడి చేయాలి? అనే అంశాలు వారు చర్చించవచ్చు.

జగన్‌కు ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, మోడీ, అమిత్ షాలకు లోక్‌సభ ఎన్నికలలో గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా అంతకంటే ముఖ్యం. ఏపీలో 25 ఎంపీ సీట్లున్నాయి. కనుక అవి వైసీపి చేజారిపోకుండా ఏవిదంగా ముందుకు సాగాలనే దానిపై ఈ భేటీలో వారు చర్చించవచ్చు.

మోడీ, అమిత్ షాల అనుమతితోనే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన్నట్లు ఏపీ ప్రజలు భావిస్తున్నారు కనుక దాని వలన తమకు, పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిష్ట కలుగుతోంది. ఏపీలో బీజేపీ నష్టపోతోంది. కనుక ఇక్కడితో ఈ కేసులు, వేధింపులు, అరెస్టులు నిలిపివేయమని ప్రధాని నరేంద్రమోడీ సూచించవచ్చు.

ఈ భేటీలో వారు ఏమి చర్చించినప్పటికీ అది ముగిసిన తర్వాత ఏపీ రాష్ట్ర రాజకీయాలు మరింత వేగం పుంజుకోవచ్చు. మరింత వేడెక్కవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విడుదల, పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories