వాలంటీర్లను దూరం ఉంచమని ఈసీ చెపుతుంటే….

YS-Jagan-Grama-Ward-Volunteers

చట్ట బద్దత లేని వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమీషన్‌ హెచ్చరిస్తున్నా, రెండున్నర లక్షల మంది వాలంటీర్లే నా సైన్యమని, వాళ్ళతోనే ఎన్నికలను ఎదుర్కొంటానని సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిన్న మరోసారి బహిరంగంగా చెప్పారు. రెండు నెలలో జరుగబోయే ఎన్నికలకు మీరూ సిద్దమేనా? అని వాలంటీర్లను గుచ్చి గుచ్చి అడిగారు.

జన్మభూమి కమిటీలు టిడిపి ఓటమికి కారణమని కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉప ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థ వల్లనే వైసీపి విజయాలు సాధించిందని, త్వరలో జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలలో కూడా వాలంటీర్ల సహాయసహకారాలతో విజయం సాధించబోతోందని జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు.

ADVERTISEMENT

ఈసీ వద్దని చెపుతున్నప్పటికీ ఎన్నికలలో వాలంటీర్లను వాడుకుంటామని సిఎం జగన్‌ ఇంత స్పష్టంగా చెపుతుంటే, టిడిపి, జనసేనలు అభ్యంతరం చెప్పకుండా వేరే అంశాల గురించి మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

జగన్‌ స్వయంగా టిడిపి, జనసేనలకు ఇంత గొప్ప అస్త్రాన్ని అందిస్తుంటే, దానిని అందిపుచ్చుకొని ఈసీకి ఫిర్యాదు చేయాలనే ఆలోచన చేస్తున్నాయో లేదో తెలీదు.

టిడిపి, జనసేనలు ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచలేకపోతే తప్పకుండా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తాపీగా బాధపడటానికి కూడా జగన్‌ వాటికి అవకాశం ఇవ్వకపోవచ్చు.

రాబోయే ఎన్నికలలో వాలంటీర్లను జగన్‌ తన సైన్యంగా ఉపయోగించుకోబోతున్నట్లు స్వయంగా తేల్చి చెప్పేశారు. అందుకే ఆ యుద్ధంలో తనకు అండగా నిలబడబోయే వాలంటీర్ల సైన్యాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నిన్న రూ.392 కోట్లు పంచి పెట్టేశారని అర్దమవుతోంది.

బటన్ నొక్కుడు సభలలో ‘మీ ఈ బిడ్డ మిమ్మల్నే (ప్రజలను) నమ్ముకున్నాడని’ జగన్‌ చెపుతుంటారు. కానీ నిన్న గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో జరిగిన వాలంటీర్ల సభలో జగన్ మిమ్మల్నే నమ్ముకున్నానని చెపుతున్నారు.

మరోపక్క ‘నువ్వే మా నమ్మకం జగన్‌’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కొద్దీ వైసీపి జెండాలు, ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించారు.

ఇంతకీ జగన్‌ ప్రజలను నమ్ముకున్నారా లేక వాలంటీర్లను నమ్ముకున్నారా లేక ప్రజలనే తనను నమ్మమని అడుగుతున్నారా?

జగన్‌ సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరికి సొంత చెల్లిని కూడా నమ్మడం లేదు. వారు కూడా ఆయనను నమ్మడం లేదు. అయినా రాబోయే ఎన్నికలలో 175/175 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెపుతున్నారు. ఎలా సాధ్యం? ఏం చేసి ఎన్నికలలో గెలవబోతున్నారు?

టిడిపి, జనసేనలకు బాగా తెలుసు. కనుక ప్రజల కంటే ఆ రెండు పార్టీలే అప్రమత్తంగా, చురుకుగా ఉండటం చాలా అవసరం. టిడిపి, జనసేనలు నేతలు బహిరంగ సభలలో చమత్కారంగా మాట్లాడి ప్రజలను రంజింపజేయడం కంటే లోతుగా ఆలోచింపజేయగలిగితేనే ఏమైనా ఫలితం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories