తెలంగాణలో పరిశ్రమలు, ఐటి కంపెనీలకు కరువు లేదు. అయినా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులు, పరిశ్రమల కోసం దావోస్, ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్ళారు. తనతో పాటు పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్లను కూడా వెంటబెట్టుకొని వెళ్ళారు.
తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోవడం, రాకపోవడం వలన యువత డిగ్రీలు చేతపట్టుకుని హైదరాబాద్, బెంగళూరులకు వలసలు పోతూనే ఉన్నారు.
అయినా సిఎం జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టిన్నట్లు కూడా లేదు. ఈ ఏడాది కూడా దావోస్ సదస్సుకు హాజరుకాలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, అవసరాల కంటే వైసీపి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకోవడం వలన కావచ్చు.
ఇక ఏపీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాను మంత్రిననే విషయం ఎప్పుడో మరిచిపోయారు. పైగా జగన్ టికెట్ ఇవ్వనని చెప్పేశారు కూడా! కనుక దావోస్ వెళ్ళి నవ్వులపాలవడం కంటే, చంద్రబాబు నాయుడి కేసుల గురించి మాట్లాడుతుంటే జగన్ మనసు కరుగకపోదా… మళ్ళీ టికెట్ ఇవ్వకపోరా?అని ఆ పనిలో బిజీగా ఉన్నారు.
కొత్తగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి, దావోస్ వెళ్ళి ‘ప్రభుత్వాలు మారినా పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వ విధానాలు మారలేదని’ చక్కటి సందేశం ఇవ్వగలిగారు. కానీ ఏపీలో వైసీపి అధికారంలోకి రాగానే ఉన్న పరిశ్రమలు, ఐటి కంపెనీలనే రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసిన మనల్ని నమ్మి ఏపీలో ఎవడు పెట్టుబడులు పెడతారానే స్పృహ ఉండి ఉండవచ్చు.
కనుకనే దావోస్ వెళ్ళి పుణ్యకాలం వృధా చేసుకునే బదులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్చార్జిలను మార్చుకుని ఎన్నికలకు సిద్దమవడమే మంచిదని బహుశః జగన్ భావించి ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా పెట్టుబడులు, పరిశ్రమలు సాధించడం కోసం దావోస్ ఎందుకు వెళ్ళలేదు?అని గట్టిగా ప్రశ్నిస్తే, ఎన్నికలకు ముందు మరోసారి వైజాగ్లో సదస్సు నిర్వహించి రాష్ట్రానికి మరో రూ.13-15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేశాయని చెప్పుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది కదా?




