విశాఖ ఎయిర్ పోర్ట్ కు వైసీపీ అధినేత జగన్ విశాఖకు చేరుకోవడంతో, అప్పటివరకు పోలీసుల ఆధీనంలో స్తబ్దుగా ఉన్న నగరంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ నగరంలోకి చేరుకుంటే పరిస్థితులు చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో పోలీసులు జగన్ ను ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకున్నారు. అయితే తనను నగరంలోకి వెళ్లకపోయినా, కనీసం ఎయిర్ పోర్టు ప్రాంగణంలోకి కూడా వెళ్ళకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి.
రెండే రెండు సంవత్సరాలు… ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రిని… ఎవరినీ మరిచిపోను… అందరినీ గుర్తు పెట్టుకుంటాను… అంటూ పోలీసులపై జగన్ మండిపడ్డారు. అలాగే అసలు మీరు పోలీసులేనా… ఐడీ కార్డులు చూపించండి… అంటూ తన వైసీపీ వర్గంతో కలిసి పోలీసులను నిలదీసే ప్రయత్నం చేసారు. అక్కడ నుండి మరో ప్లేస్ కు తరలిస్తున్న సమయంలో కూడా పోలీసులను ఉద్దేశించి… ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావు నువ్వు… తర్వాత ఏమీ చేసుకోలేవు అన్నట్లుగా ఒక విధమైన వార్నింగ్ ఇచ్చారు జగన్.
జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే… నిజంగా ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా పోలీసులపై మండిపడరేమో అనిపించక మానదు. బహుశా జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటోంది… ఇలా పోలీసులపై, తన మాటలు వినని అధికారులపై రివేంజ్ తీర్చుకోవడానికేమో అన్నట్లుగా కనపడుతోంది. అయినా 144 సెక్షన్ అమలులో ఉన్నపుడు కొందరు పోలీసులు సివిల్ డ్రెస్ లో విధులు నిర్వహిస్తారన్న కనీసం విషయం కూడా తెలియని జగన్, నిజంగా ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అన్నది ఆలోచించుకోవాలి.
ఇలాంటి వార్నింగ్ లు ఇవ్వడం జగన్ కేమీ కొత్త కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాలలో ప్రభుత్వ అధికారులపై, పోలీసు వర్గాలపై మండిపడ్డారు. జగన్ రెండేళ్ళ తర్వాత సిఎం అవుతారో లేదో గానీ, ఆ సౌండింగ్ మాత్రం గత మూడేళ్ళ నుండి వినపడుతూనే ఉంది. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే… ‘ఆర్య 2’లో బ్రహ్మానందం చెప్పిన ‘హెలిసినేషన్’ కాన్సెప్ట్ గుర్తుకు రావడం సహజమే. తానూ ముఖ్యమంత్రి అయితే పాలన ఎలా ఉండబోతుందో అన్న విషయాన్ని విశాఖ ఎయిర్ పోర్టు వేదికగా యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి చూపించారు జగన్ మోహన్ రెడ్డి.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



