ఏపీ ప్రజలకు జగన్ మరో బిస్కెట్?

YS Jagan2019 ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేసిన తర్వాతే మరుసటి ఎన్నికలకు ఓటు అడుగుతానని బల్లగుద్ది మరీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు సాధించింది ఏంటి? అంటే… తెల్లమొహం వేయాల్సిందే. గత నాలుగేళ్లుగా చేసిన అభివృద్ధి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఇప్పటికే విశాఖలో తమ కార్యకలాపాలను చేస్తోన్న ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీని, నేడు మన ముఖ్యమంత్రివర్యులు కొత్తగా ప్రారంభిస్తున్నట్లుగా మీడియాకు కవరేజ్ ఇవ్వడమే! అలాగే ఇవన్నీ అవగాహన లేనటువంటి ప్రజలను మభ్యపెట్టడమే!

సాధించింది ఏమీ లేకపోయినప్పటికీ, కూల్చివేతలలో ‘ఆల్ టైం రికార్డు’లను కొల్లగొట్టడం మాత్రం ఇప్పటి ముఖ్యమంత్రికే చెల్లిందనేది గత నాలుగేళ్ల పాలన చెప్పకనే చెప్తోంది. ఇవన్నీ పక్కన పెడితే, మరో ఆరు మాసాలలో ఎన్నికలకు వెళ్ళబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి జగన్ గారు మరో బిస్కెట్ ను సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేలేండి… పొలిటికల్ పరిభాషలో చెప్పాలంటే జనాలకు “తాయిలాలు” ఇవ్వడానికి సన్నద్ధం అయినట్లుగా మీడియా వర్గాలలో కధనాలు వస్తున్నాయి.

ADVERTISEMENT

ఈ సారి కొట్టేది మాములుగా ఉండకూడదనే విధంగా… ఏకంగా రాష్ట్రంలో భూములు లేనటువంటి ప్రజానీకానికి అర ఎకరం నుండి రెండు ఎకరాల వరకు భూములను పంచే విధంగా ప్రణాళికలు సిద్ధంగా చేసినట్లుగా తెలుస్తోంది. “ఏంటి… ఒక్కొక్కరికి గరిష్టంగా రెండు ఎకరాల వరకు ఇస్తారా?” అని నోరెళ్ళబెట్టకండి. ప్రస్తుతం ఈ దిశగా కార్యాచరణ సిద్ధం చేసి, ఏకంగా దీపావళి నాటికి అమలు పరచాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లుగా పొలిటికల్ టాక్.

అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు సెంట్లు భూమి మరియు అందులో పక్కా గృహనిర్మాణం అంటూ ప్రచారం చేసి, సీఎం అయ్యాక సెంటు భూమి ఇచ్చినట్లుగా జగన్ ఫొటోలతో పేపర్లు పంచిపెట్టగా, నాలుగేళ్లు అయినా ఆ పేపర్లకు ఇప్పటివరకు సమాధానం లేదు. ఇప్పుడేమో కొత్తగా పంట భూముల పంపకాలు అంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనిని ఎంతవరకు కార్యాచరణలోకి తీసుకువస్తారనేది పక్కన పెడితే, తమ అనుకూల మీడియా వర్గాల ద్వారా భారీ ఎత్తున “గోబెల్స్” ప్రచారం అయితే చేయిస్తారని అవగతం చేసుకోవచ్చు.

పొరపాటున ఇదేదో వాస్తవం అని, తమకు ఏ అర ఎకరమో, రెండు ఎకరాలు వస్తాయని ప్రజలు విశ్వసిస్తే మాత్రం మరోమారు భంగపాటుకు గురి కావాల్సి ఉంటుందని చెప్పకతప్పదు. ఎందుకంటే, ఈ నాలుగేళ్లల్లో అన్ని నోటి మాటలే తప్ప, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏ ఒక్కటి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. బటన్ నొక్కుతూ ఆర్ధికంగా కొంతమంది ఖాతాలలోకి నగదును అయితే బదిలీ చేయిస్తున్నారు గానీ, మిగతా అభివృద్ధి కార్యక్రమాల చిట్టాపొద్దు మాత్రం కనుచూపు మేరలో కానరాదన్నది జగమెరిగిన సత్యం.

ADVERTISEMENT
Latest Stories