మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్లో పెద్ద రగడే జరుగుతుంది అయితే దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కనీసం అమరావతికి భూములిచ్చిన రైతులలో ధైర్యం నింపే ప్రయత్నమూ చెయ్యలేదు. ఇవాళ విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
ఆ తరువాత తన స్పీచ్ లో సీఎం జగన్ ‘మూడు రాజధానులు’ ప్రస్తావన తెచ్చారు. “రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, అలాంటి గాయాలు మరల తగలకూడదన్నా రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చెయ్యాలి. అందుకే వికేంద్రీకరణే సరైనదని నిర్ణయిం తీసుకున్నాం,” అని జగన్ చెప్పుకొచ్చారు.
“మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానులు బిల్లులను చట్టంగా మార్చాము. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రంగా న్యాయ రాజధానికి పునాదులు వేస్తాం,” అని ఉటంకించారు. మరోవైపు… ఈ విషయంలో కోర్టులలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఈ విషయంలో తదుపరి హియరింగ్ వరకు యథాస్థితి కొనసాగించాలని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుని కూడా ఆశ్రయించింది. ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి తన స్పీచ్ లో ఎప్పుడో మర్చిపోయిన ప్రత్యేక హోదా కూడా గురించి కూడా ప్రస్తావించడం కొసమెరుపు… ” ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నాము,” అని ప్రకటించేశారు.





