సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సస్పెండ్ చేయబడిన సీఐ నాగరాజుని ప్రశ్నించేందుకు విజయవాడ కోర్టు 8 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. అయితే తాను నిర్దోషినని, సిట్ అధికారులు తనని బలవంతంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సీఐ నాగరాజు విజయవాడ కోర్టుకి ఓ లేఖ వ్రాసారు. అది వైసీపీ సొంత మీడియాలో ప్రత్యక్షమవడం విశేషం.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాతే కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆ పార్టీ నేతలు, వారి మీడియా చెప్పుకున్నారు. తాము జోక్యం చేసుకోకపోతే కూటమి ప్రభుత్వం ఈ కేసుని అటకెక్కించేసేదేనని చెప్పుకున్నారు. అంటే సీఐ నాగరాజుతో సహా నిందితులను కూటమి ప్రభుత్వం కాపాడాలనుకుందని వైసీపీ వాదనగా కనిపిస్తోంది.
కానీ ఇప్పుడు సీఐ నాగరాజు తాను నిర్దోషినంటూ కోర్టుకు వ్రాసిన లేఖను హైలైట్ చేస్తూ అతను ఇంకేమి సంచలన విషయాలు బయటపెడతారో?అంటూ ‘సెకండ్ ఎపిసోడ్’కి చిన్న హింట్ ఇచ్చింది. అంటే అతను ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్తారని వైసీపీ చెప్తోందా? లేక అతనికి అన్యాయం జరుగుతోందని చెప్పాలనుకుంటోందా?
సాయికృష్ణ పేరుతో కుల,శవ రాజకీయాలు చేసిన వైసీపీ ఇప్పుడీ కేసులో సీఐ నాగరాజు పేరుతో రాజకీయాలు చేయబోతోందా? అనే సందేహం కలుగుతుంది. ఇంతకీ సాయికృష్ణ కేసులో వైసీపీ వైఖరి ఏమిటో?






