తానూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినా…. తన కొడుకు కోసం రాష్ట్రాన్ని దోచిపెట్టాడు అనే ఆరోపణలు వ్యక్తమైనా… ఒక నాయకుడిగా ఏదొక మూలన ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడన్న మాట మాత్రం వాస్తవం. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన దాని కంటే వైఎస్ ఎక్కువ కీర్తినే ఆర్జించినప్పటికీ… ప్రజలను ఆకర్షించే లక్షణం, మాట తీరును తన సొంతం చేసుకున్నారు వైఎస్.
మరి అంతటి భారీ ప్రజాబలం ఉన్న వైఎస్ వారసుడిగా రంగప్రవేశం చేసిన జగన్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా ఎందుకు మారుతోంది? కనీసం తన పార్టీ తరపున గెలిచిన సభ్యులను కూడా ఎందుకు తనతో పాటు ఉంచుకోలేకపోతున్నారు? అంటే దానికి రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యే ఏకైక సమాధానం ‘జగన్ వ్యవహార శైలి.’ అవును… ఆ ఒక్క విధానమే వైఎస్ ను ఆకాశంలో నిలబెట్టింది… జగన్ ను పాతాళంలో నెట్టేస్తోంది..!
వైఎస్ ముఖ్యమంత్రి పదవి అధిష్టించడానికి రెండు దశబ్దాలు పైనే సమయం పట్టిందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అంతటి సుధీర్ఘమైన అనుభవం కళ్ళెదురుగా ఉంచుకుని కూడా జగన్ ఈ విధంగా రాజకీయాలు చేయడమే… సాధారణ రాజకీయ నాయకుల నుండి జగన్ ను వేరు చేస్తోంది. వైఎస్ ఉన్న సమయంలో “30 ఏళ్ళకే ఇంత చిచ్చరపిడుగుగా రాజకీయాల్లో వ్యవహరించాడని” పేరు తెచ్చుకున్న జగన్… ప్రస్తుతం “40 ఏళ్ళకే ఇంత రచ్చ చేసారా” అని విమర్శల పాలవ్వాల్సి రావడం జగన్ స్వయంకృతాపరాధమే అన్నది అందరూ అంగీకరించే వాస్తవం.
నాడు వైఎస్ నీడన జగన్ ను చూసిన వారికి… ఆ తర్వాత వైఎస్ కాలం చేసిన పిదప తన అసలు స్వరూపం చూపించారన్న టాక్ తోనే ఒకప్పుడు పార్టీలోకి వెళ్ళిన వారంతా ఒక్కొక్కరుగా గోడకు కొట్టిన బంతి మాదిరి తిరిగి వస్తున్నారనేది రాజకీయ వర్గాల మాట. ఓర్పు, సహనం, ఆకట్టుకునే మాట తీరు, చెదరని చిరునవ్వు ‘వైఎస్ బ్రాండ్స్’గా మారి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించేలా చేసాయి. మరి జగన్ విషయానికి వస్తే… ‘అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షనిజం, కుటిల రాజకీయం’ వంటి వాటిని నాలుగు స్తంభాలుగా చేసుకుని తన ‘కోట’ను తానే కూలదోల్చుకుంటున్నాడు అనే అభిప్రాయాలను ప్రజల్లో కలిగేలా చేస్తున్నాడు.
జగన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే… తండ్రిగా ఇప్పటికే వైఎస్ పేరును మసక బారేలా చేసాడన్న కీర్తిని ఇప్పటికే సంపాదించుకున్న జగన్, ఇక మున్ముందు వైఎస్ జన్మదినోత్సవ వేడుకలను జరిపే అర్హత జగన్ కోల్పోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చన్నది పొలిటికల్ వర్గాల మాట. అంటే ఆ విధంగా ప్రజలు వైసీపీ అధినేతను తిప్పికొడతారన్న మాట.



