ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎల్నినో కష్టాలు అటు రైతన్నలను ఇటు ప్రభుత్వాలను బాధిస్తుంటే ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసుల వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి.
ప్రపంచానికి తన వైరస్ పవర్ ని ఒకసారి రుచి చూపించిన కరోనా ఇప్పుడు మరోసారి వార్తలలో నిలుస్తుంది. దీనితో నాటి చేదు జ్ఞాపకాలన్నీ తిరిగి కళ్ళముందు ప్రత్యక్షమవుతున్నాయి.
ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో జులై మధ్యస్థానికి వచ్చినా వేసవి 2.0 అన్నట్టుగా భానుడి భగభగలు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాలు లేక ఎండలు తాళలేక ఇటు పక్క ప్రజలు అల్లాడుతుంటే, తొలకరి చినుకు కోసం బీడు బారిన భూములను చూస్తూ రైతులు కళ్ళు కాయలు కాచేలా వరుణుడి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.
తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే కొన్ని జిల్లాలో ప్రజలు నీటి కొరతతో వాటర్ ట్యాంకర్లను నమ్ముకుంటున్నారు. బిందెలు పట్టుకుని నీళ్ల కోసం వాటర్ ట్యాంకర్ వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇక ఇప్పుడు వార్తలలో కరోనా పేరు మరోసారి హెడ్ లైన్స్ లో రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఏపీ విషయానికొస్తే కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలకు సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
ఇక నిన్న మంగళగిరి లోని ఏయిమ్స్ ఆసుపత్రి సూపరెండెంట్ కూడా తమ ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదుకాలేదంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత 20 రోజులలో కేరళంలో 115, కర్ణాటకలో 64, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 39, ఏపీలో 13 కరోనా కేసులు నమోదయినట్టు పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు వార్తలలో వినిపిస్తున్న కరోనా వేరియంట్ ప్రమాదకరం కాదని, కోవిడ్ తో పాటుగా ఉన్న కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతోనే కొన్ని మరణాలు సంభవించాయి కానీ అవి పూర్తిగా కోవిడ్ మరణాలు కాదంటూ మంత్రి సత్య కుమార్ కోవిడ్ కేసుల పై వస్తున్న అపోహలకు వివరణ ఇచ్చారు.అయితే ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉన్న ప్రజలు కూడా తమ తమ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.




