వైసీపీ నేత మైసూరా రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన వేళ పార్టీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే మైసూరా అంశంపై స్పందించిన జగన్, ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. అసలు మైసూరా రెడ్డి పార్టీకి దూరమై చాలా కాలం అయ్యిందని, దాదాపు ఆరు మాసాలుగా మైసూరాను చూడలేదని చెప్పడం రాజకీయ విశ్లేషకులకు విస్మయాన్ని కలిగిస్తోంది.
నేడు మైసూరా పార్టీని వీడడాన్ని జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. కానీ, ఆరు మాసాలుగా అసలు పార్టీ కార్యక్రమాల్లో జగన్ ఎందుకు పాల్గొనడం లేదు అన్న విషయాన్ని జగన్ గుర్తించి కూడా దిద్దుబాటు చర్యలు ఎందుకు చేపట్టలేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తానూ జైలుకు వెళ్తున్న సమయంలో పార్టీ కార్యకలాపాలను చూడాల్సిందిగా మైసూరా రెడ్డిని ఏరికోరి తెచ్చుకున్న జగన్, ఆ అవసరం తీరిపోయిన తర్వాత మాత్రం దూరం పెట్టడం జగన్ నైజాన్ని కళ్ళకు కట్టినట్లు చాటిచెప్తోంది.
ముఖ్యంగా ఆరు మాసాలుగా పార్టీ అంతర్గతంగా ఒక సీనియర్ నేత ఎందుకు సలహాలు ఇవ్వడం లేదన్న కనీస అవగాహన లేకుండా పార్టీ నడుపుతున్నారంటే… జగన్ ఏ స్థాయి నాయకుడో అర్ధం చేసుకోవచ్చాన్నది రాజకీయ వర్గాల మాట. ఈ విషయంలో జగన్ కంటే మెగాస్టార్ చిరంజీవి కొంతవరకు నయం అనిపించేలా కనపడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చూడబోతుంటే మైసూరా చెప్పినట్లు… వైసీపీలో మనుషుల కంటే డబ్బులకే ఎక్కువ విలువ ఇస్తున్నట్లుగా పార్టీ అధినేత వ్యాఖ్యలే ఊతమిస్తున్నాయి.
అందరినీ దూరం చేసుకోవడమే నిజమైన రాజకీయ నాయకత్వ లక్షణాలుగా పరిగణించాల్సి వస్తే… అందులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా “నెంబర్ 1”గా ఎన్నిక అవుతారని తాజా పరిణామం చెప్పకనే చెప్పింది. మైసూరా పార్టీని వీడిపోవడం వలన వైసీపీ నష్టం కలిగినా, లేకున్నా… ఒక నాయకుడిగా జగన్ కు మాత్రం తీవ్ర నష్టం కలిగిందని చెప్పక తప్పనిసరి. పార్టీ సభ్యులను సరిగా చూసుకోలేని వారు కూడా పార్టీలు నడుపుతుండడం భారతదేశ ప్రజాస్వామ్యానికి నిదర్శనం అయితే అయి ఉండవచ్చు గానీ, జగన్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు లభించడం ఏపీ ప్రజల దౌర్భాగ్యంగానే పరిగణించాలని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.



