టిడిపి హయాంలో అమరావతిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ, మండలి వగైరాలను ప్రభుత్వం ‘తాత్కాలిక భవనాలు’గా పేర్కొనడం రాజకీయంగా పెద్ద పొరపాటని తర్వాత రుజువైంది. ఇప్పుడు ఆ చర్చ అనవసరం.
అయితే ఆనాడు కట్టిన ఆ తాత్కాలిక సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలనే నేటికీ జగన్ ప్రభుత్వం ఉపయోగించుకొంటోంది. వాటిలో కూర్చొనే రాష్ట్రాన్ని పాలిస్తూ ‘అమరావతి రాజధానిగా పనికిరాదని’ వైసీపి నేతలు బల్లగుద్ది వాదిస్తున్నారు. ఆ తాత్కాలిక భవనాలలనే నేటికీ వాడుకొంటూ వాటి కోసం చంద్రబాబు నాయుడు వేలకోట్లు ఖర్చుచేసి ప్రజాధనం దుబారా చేశారని ఆరోపిస్తున్నారు.
కనుక టిడిపి చేసిన ఆ పొరపాటుని వైసీపి ప్రభుత్వం చేయదని ఆశించడం తప్పు కాదు. కానీ విశాఖలో ఋషికొండపై ‘పర్యాటక శాఖ కోసం’ అంటూ సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను ‘తాత్కాలిక అవసరాల కోసం’ వాడుకోబోతున్నామని వైసీపి ప్రభుత్వం చెపుతోంది.
ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలనుకొంటున్నారు కనుక ఆయన విశాఖలో బస చేసేందుకు వాటిని వాడుకొంటామని చెపుతోంది. వైసీపి ప్రభుత్వం చెపుతున్న ప్రకారమే ఇవి కూడా తాత్కాలిక అవసరాల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలని భావించాల్సి ఉంటుంది. ఆనాడు టిడిపి తాత్కాలిక భవనాల కోసం ప్రజాధనం వృధా చేసిందని ఆరోపించి, మరిప్పుడు వైసీపి చేస్తున్నదేమిటి?
టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించి, అక్కడే సచివాయం, శాసనసభ, హైకోర్టులను నిర్మించింది. అవి నేటికీ రాష్ట్రానికి, జగన్ ప్రభుత్వానికి కూడా అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అవి ఉండగానే జగన్ ప్రభుత్వం విశాఖలో మళ్ళీ రూ.300 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక అవసరాల కోసం భవనాలు నిర్మించడం దేనికి? ఇది ప్రజాధనం వృధా చేయడం కాదా? కోర్టు అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనాలను కూల్చివేయాల్సివస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
అసలు విశాఖ నుంచి పాలన చేస్తామని చెప్పి నిర్మించిన ఈ భవనాలపై జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త కధ ఎందుకు చెపుతోందో అందరికీ తెలుసు.
రాజధాని అంశం హైకోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నందున అది తేలేవరకు విశాఖలో రాజధాని ఏర్పాటుకి సంబందించి ఎటువంటి పనులు చేపట్టవద్దని కోర్టులు ముందే హెచ్చరించాయి. అలా చేస్తే కోర్టు ధిక్కారణ అవుతుందని, కోర్టులలో మొట్టికాయలు పడతాయని తెలిసి ఉన్నా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి రూ.300 కోట్లు ఖర్చు చేసి ఋషికొండపై ఈ భవనాలను నిర్మించడమే కాకుండా, అక్కడి నుంచే జగన్ రాష్ట్రాన్ని పాలిస్తారని ముందు వైసీపి నేతలందరూ చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు అదే మాట ధైర్యంగా చెప్పడానికి భయపడుతున్నారు.
‘ఉత్తరాంద్ర అభివృద్ధి పర్యవేక్షణ కొరకు’ అనే మరో పరదా వేస్తున్నారు. అంటే వాటి కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసి నిర్మించినా వాటిని సచివాలయమని, సిఎం క్యాంప్ కార్యాలయమని చెప్పుకోలేని దుస్థితి నెలకొందన్న మాట!
కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మించిన వాటికి ఇది ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటూ తాటికాయ అంత అక్షరాలతో వ్రాసిన పెద్ద బోర్డులు పెట్టుకొని ధైర్యంగా, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. వాటిలోనే కూర్చొని చంద్రబాబు నాయుడు నిందిస్తుండటం, తింటున్న కంచంలో ఉమ్ముకోవడం వంటిదే కదా?



