నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సిఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో పలు అంశాలపై చర్చించిన్నట్లు ఆత్మసాక్షి పేర్కొంది. అయితే అవన్నీ నిధులు విడుదల గురించే కావడం విశేషం. అంటే ఏదో పేరుతో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన్నట్లు స్పష్టమవుతోంది.
ఎందుకంటే మరో మూడు రోజుల్లో 1వ తేదీ వచ్చేస్తోంది. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలి. కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ సమయంలో కూడా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తామంటే వారు ఊరుకోరు. జీతాల కోసం వారు ప్రభుత్వంపై విరుచుకుపడతారు. అనేక నెలలుగా కొనసాగుతున్న ఈ జీతాల చెల్లింపు సమస్యతో పాటు తమ బకాయిల చెల్లింపులు, పీఆర్సీ తదితర అంశాలపై సంక్రాంతి పండగ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.
కనుక ముందు 1వ తేదీన వారందరికీ జీతాలు వేసేస్తే వారు చల్లబడతారు. కనుక అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలి. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన్నట్లు సిఎం జగన్ వినతులే తెలియజేస్తున్నాయి. ఇంతకీ సిఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీని ఏమడిగారంటే…
1. 2014-15 సం.లకి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం నుంచి ఏపీకి రావలసిన బకాయిలు రూ. 18,330.45 కోట్లు. ఇతర బకాయిలు కలిపి రూ.32,625.25 కోట్లు విడుదల చేయాలి.
2. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన రూ.2,937.92 కోట్లు బకాయిలు విడుదల చేయాలి.
3. పోలవరం పెరిగిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు అనుమతి మంజూరు చేయాలి.
4. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తున నిర్మిస్తున్నందున ముంపు ప్రాంతాలలో ప్రజల తరలింపు, వారి పునరావాసం కోసం రూ.10,485.38 కోట్లు అవసరం. ఆ సొమ్ముని అడ్హక్గా విడుదల చేయాలి.
5. తెలంగాణ డిస్కంలో నుంచి రూ.6,886 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. వాటిని ఇప్పించాలి.
అంటే అన్ని కలిపి రూ.1,08,482.55 కోట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని అడిగారన్న మాట! దానిలో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548 కోట్లు తీసేసినా మిగిలిన రూ.52,934.55 కోట్లు ఇవ్వాలని సిఎం జగన్ అడుగుతున్నారన్న మాట!
అయితే కేంద్ర ప్రభుత్వం ఏనాడూ అంత సొమ్ము ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఈవిషయం సిఎం జగన్కి కూడా బాగా తెలుసు. ప్రతీనెల ఇలాగే వేలకోట్లు కావాలని అడగడం చివరికి కేంద్ర ప్రభుత్వం దయతలచి ఓ 3-4,000 కోట్లు మాత్రం విదిలిస్తుంటుంది. ఇప్పుడూ అదే జరుగుతుంది. ఆ మాత్రం విదిలించినా ఈ నెల జీతాల సమస్య తీరిపోతుంది. కానీ అదైనా నేడో రేపో విడుదల చేస్తేనే 1వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించగలుగుతుంది లేకుంటే మళ్ళీ షరా మామూలే.



