ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపి 2019లో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఐదేళ్ళలో రాష్ట్రంలో రాజకీయంగా చాలా బలపడింది. మళ్ళీ ఎన్నికలలో గెలిచేందుకు చేయవలసినవి, చేయకూడనివీ అన్నీ చేసింది.
మహాభారతంలో కర్ణుడు ఎంత మహావీరుడు అయినప్పటికీ, ఎన్ని దివ్యాస్త్రాలు చేతిలో ఉన్నప్పటికీ ఏవీ అతనికి యుద్ధంలో ఉపయోగపడలేదు. ఏవీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాయి. వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే కనిపిస్తోంది.
ఆయన తనను తాను అర్జునుడితో పోల్చుకుంటున్నప్పటికీ, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో భ్రష్టు పట్టించేసినందుకు, ఎన్నికలకు ముందు సొంత పార్టీలోనే మార్పులు చేర్పులు చేసుకుంటూ విధ్వంసం సృష్టించుకుంటున్నందున టిడిపి నేతలు ఆయనను భస్మాసురుడితో పోల్చుతున్నారు. అది వేరే విషయం.
ఇప్పుడు ఓసారి తెలంగాణ కాంగ్రెస్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకోవలసి ఉంది. దానిని కేసీఆర్ పదేళ్ళలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ పరిస్థితి, తమ పరిస్థితి గురించి ఆలోచించకుండా తమలో తాము పదవులు, టికెట్ల కోసం కుమ్ములాడుకుంటూ ఉండిపోయారు.
ఈ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో సర్వశక్తివంతుడైన కేసీఆర్ని, బిఆర్ఎస్ పార్టీని ఓడించడగలదని కలలో కూడా ఎవరూ ఊహించలేకపోయారు. కానీ ఎన్నికలకు ముందు శరవేగంగా పుంజుకుని కేసీఆర్ని ఓడించి అధికారంలోకి రాగలిగింది.
అదే… ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళుగా తిరుగులేని అధికారం చలాయిస్తూ, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఎన్నికలకు ముందు తడబడుతుండటం చూసి వైసీపి నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో జాబితాలో ప్రకటించిన అభ్యర్ధులకు మూడు, నాలుగు రెట్లు మంది అసంతృప్తితో పార్టీ వీడుతున్నారు. ఈసారి ఎన్నికలలో వైసీపికి ఎదురు గాలి వీస్తున్నప్పుడు, వరుసపెట్టి ఇంత మంది పార్టీని వీడి వెళ్ళిపోతుండటం ఒక నష్టం కాగా, పోతూ పోతూ వారు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి గురించి, తమ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా పద్దులు, భాగోతాల గురించి చెపుతున్న ‘రాజకోట రహస్యాలు’ వైసీపికి ఇంకా నష్టం కలిగిస్తున్నాయి.
ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఇంత విధేయంగా తాము పనిచేస్తే ఆయన తమను వాడుకుని, ఎన్నికలకు ముందు అసమర్ధులు, అవినీతిపరులు, పనికిరానివారు అంటూ ముద్రలు వేసి పక్కన పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు.
జగన్ అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, జిల్లా, నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా చేయడం వలననే ఆయననే నమ్ముకున్న తమకు ప్రజలలో చెడ్డ పేరు వచ్చిందని, అయితే జగన్ అదే చూపిస్తూ తమని పక్కన పెట్టేస్తున్నారని శ్రీకాళహస్తికి చెందిన కొందరు జడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ తన స్వార్ధం చూసుకున్నారే తప్ప ఏనాడూ తమ గురించి ఆలోచించలేదని సత్యవేడు వైసీపి ఎమ్మెల్యే ఆదిమూలం వంటివారు ఆరోపిస్తున్నారు. జగన్ని నమ్ముకుంటే ఆయన తమని ఎన్నికల ముందు బలిపశువులుగా చేశారని వైసీపి నుంచి బయటకు వస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





