డబ్బుకు కటకటలలాడుతున్న జగన్ ప్రభుత్వం అమ్మఒడి పధకంలో 3వ విడత కోసం రూ.6,595 కోట్లు విడుదల చేయడం చాలా గొప్ప విషయమే. కానీ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్వహణ కోసం అంటూ దానిలో నుంచి రూ.2,000 చొప్పున కోసుకోవడమే విస్మయం కలిగిస్తుంది.
ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యాశాఖకు నిధులు కేటాయిస్తుంటుంది. వాటితో పిల్లలకు పుస్తకాలు, యూనిఫారంలు, మధ్యాహ్న భోజన పధకం, పాఠశాలలో ఫర్నీచర్ కొనుగోలు, టాయిలెట్స్ నిర్వహణ వంటివన్నీ ఉంటాయి. కానీ టాయిలెట్ల నిర్వహణ కోసం మళ్ళీ అమ్మఒడి పధకంలో ప్రతీ లబ్దిదారుని నుంచి రూ.2,000 కోసుకొంటోంది. తద్వారా ఆమేరకు ఆర్ధికభారం తగ్గించుకోవాలనే బాధ కనిపిస్తోంది. అయితే అమ్మఒడిలో ఆ కుసింత కోసుకొంటే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి నుంచి విద్యార్దులకు ల్యాప్ టాపులు ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది చాలా భారం అవుతుండటంతో ల్యాప్ టాపుకి బదులు ట్యాబ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇక్కడా జగన్ ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది.
9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్దులకు అమ్మఒడికి బదులు ల్యాప్ టాపులు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ల్యాప్ టాపుకి బదులు ట్యాబ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఒకేసారి సుమారు రూ.26,000 నుంచి రూ.10,000కి ఈ ఖర్చును కుదించిందన్న మాట!
అమ్మఒడి పధకంలో రూ.15,000 ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే టాయిలెట్ల నిర్వహణ పేరుతో రూ.2,000 చొప్పున కోసుకొంటోంది. ఇప్పుడు అమ్మఒడిని ట్యాబ్ బడిగా మార్చడం ద్వారా మరో రూ.2,000 ఆదా చేసుకొనే ఆలోచన చేస్తోందనుకోవచ్చు. అంతేకాదు. దేశంలో పేద విద్యార్దులకు ట్యాబులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అని గొప్పలు చెప్పుకోవచ్చు కూడా.



