రాజకీయాలు కావచ్చు మరో రంగం ఏదైనా కావచ్చు… కొన్ని ఫోటోలు అద్భుతమైన జ్ఞాపకాలను కళ్ళ ముందు కదిలేలా చేస్తాయి. ఇందుకు పూర్తిభిన్నంగా మరికొన్ని ఫోటోలు కొందరికి తీవ్ర ఆగ్రహం, అసహనం, కడుపు మంట కలిగిస్తుంటాయి. అటువంటి ఫోటోయే ఇది కూడా.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది. అది చూస్తే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్, వైసీపి మంత్రులు ఎంతగా రగిలిపోతారో ఊహించుకోవచ్చు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి పట్ల చాలా అనుచితంగా మాట్లాడి, ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్ళడం యాదృచ్చికమనో మర్యాదపూర్వకమనో అనుకోలేము.
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే రాష్ట్రమంతా కలియ తిరుగుతూ 10-15 రోజ్లలోనే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ‘జీవకళ’ తేగలిగారు. కానీ ఇంతవరకు ఒక్క వైసీపి ముఖ్య నేతను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించలేకపోయారు. ఆమె రాజకీయ సామర్ధ్యానికి ప్రస్తుతానికి ఇదే గీటురాయి కనుక ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సాయం కోరేందుకే ఆమె సిఎం రేవంత్ రెడ్డిని కలిసి ఉండవచ్చు.
ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఏపీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడానికి సాటి కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, రేవంత్ రెడ్డి సిఎం కాకముందే చెప్పారు. ఇప్పుడు అదే చెపుతున్నారు.
అందుకే ఆయన సాయం కోరేందుకు వైఎస్ షర్మిల వెళ్ళి కలిసి ఉండవచ్చు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా జగన్కు మద్దతుగా తెర వెనుక నుంచి చక్రం తిప్పి టిడిపిని గద్దె దించారు. అదేవిదంగా ఇప్పుడు కేసీఆర్ అంతటి వాడినే ఓడించి ఇంట్లో కూర్చోపెట్టిన రేవంత్ రెడ్డి కూడా వైఎస్ షర్మిలకు మద్దతుగా చక్రం తిప్పవచ్చు. దాంతో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోవచ్చు కానీ జగన్ తప్పకుండా గద్దె దిగాల్సి రావచ్చు.





