ఊహించిన్నట్లే వైఎస్ షర్మిల ఈరోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన అన్న, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె విజయవాడలో పార్టీ కార్యకర్తలు, మీడియాని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “గత పదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరుగలేదు.
కానీ చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి ఇద్దరూ కలిసి పది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన పెట్టారు. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో ఒక మెట్రో ఉందా? కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయగలిగారా? ఓ రోడ్డు వేయగలిగారా? కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వగలుగుతున్నారా?అంటే లేదు.
మరి ఈ 5 ఏళ్ళలో జగన్ రెడ్డి పాలనలో ఏం జరుగుతోందంటే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్ మాఫియాలు భూకబ్జాలే. దోచుకోవడం దాచుకోవడమే రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు మచ్చుకైనా లేవు.
చంద్రబాబు నాయుడు అమరావతి కడతానంటూ గ్రాఫిక్స్ చూపించి వెళ్ళిపోయారు. జగన్ రెడ్డి మూడు రాజధానులన్నారు. కానీ 5 ఏళ్ళు గడిచిపోయినా రాష్ట్రనికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం పట్టుబట్టకుండా వదిలేశారు. ఆయన వదిలేస్తున్నారని జగన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ కోసం ధర్నాలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేశారు. టిడిపి ఎంపీలు కలిసి వస్తే అందరం రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దామన్నారు.
కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా స్పెషల్ స్టేటస్ పక్కన పడేశారు. ఆయన ఇప్పుడు ఆ విషయమే మాట్లాడటం లేదిప్పుడు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ వస్తే పరిశ్రమలు వచ్చాయి. యువతకు ఉద్యోగాలు లభించాయి. కానీ చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి ఇద్దరికీ చిత్తశుద్ధి లేకపోవడం, చాతకాకపోవడం వలననే ఏపీకి స్పెషల్ స్టేటస్ రాలేదు. నా దృష్టిలో టిడిపి, వైసీపి రెండూ దొందూ దొందే…”అంటూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
ఆమె ఇదివరకులా అన్నను జగనన్న అని సంబోధించకుండా జగన్ రెడ్డి అంటూ సంభోదించడం, వస్తూనే నేరుగా వైసీపి పాలనపై విమర్శలు గుప్పించడం చూస్తే ఆమె దూకుడుగానే ముందుకు సాగబోతున్నట్లు అర్దమవుతోంది.
ఆమె చేసిన ఈ విమర్శలను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రజాధరణ సంపాదించుకోవడానికి ఆమె ‘స్పెషల్ స్టేటస్’ అంశాన్ని వాడుకోబోతున్నారని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక టిడిపి రాజకీయ ప్రత్యర్ధిగానే భావించాల్సి ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు గుప్పించిన్నట్లు అర్దమవుతోంది. అయితే టిడిపి, జనసేనలను విమర్శించడం వలన కాంగ్రెస్ పార్టీకి ఇంకా నష్టమే తప్ప లాభం ఉండదని ఆమె త్వరలోనే గ్రహించవచ్చు.
ఆమె అన్న జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొంటేనే వైసీపిలో నుంచి బయటపడాలని ఎదురుచూస్తున్నవారికి ఆమెపై నమ్మకం కలుగుతుంది. కనుక ఇకపై ఆమె మెయిన్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి… వైసీపి ప్రభుత్వమే అవుతుంది.




