వివేకా హత్య కేసు… మరో సీజన్‌ గ్యారెంటీ!

YS Vivekananda Reddy Caseఓ సినిమా హిట్ అయితే సీక్వెల్‌ తీస్తారు. ఓ వెబ్‌ సిరీస్‌ హిట్ అయితే మరో సీజన్‌ తీస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించి, దాదాపు నాలుగేళ్ళుగా విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు విచారణకు సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. కానీ ఇంతవరకు సీబీఐ ఇంతవరకు విచారణ పూర్తి చేయలేకపోయింది. అంటే వెబ్‌ సిరీస్‌ భాషలో చెప్పుకొంటే సీజన్‌ 1 సస్పెన్స్‌తో ముగుస్తోందన్న మాట! కనుక రేపటి నుంచే సీజన్‌-2 మొదలవుతుంది. అది ఇంకా ఎన్ని నెలలు లేదా ఎన్నేళ్ళు సాగుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబందాలు, వాటి రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను బట్టి ఉంటుందని అందరికీ తెలుసు.

ADVERTISEMENT

ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టే గడువు విధించింది. అయితే ఈ కేసు విచారణను మలుపులు తిప్పింది కూడా సుప్రీంకోర్టే. కనుక ఈరోజు సుప్రీంకోర్టులో అనూహ్యంగా ఏదో జరిగిపోతుందనుకోవడం అజ్ఞానమే.

ఎప్పటిలాగే సీబీఐ మళ్ళీ సుప్రీంకోర్టుని గడువు పొడిగించమని కోరుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు సీబీఐకి చీవాట్లు పెట్టి మళ్ళీ గడువు పొడిగిస్తుంది. అయితే సీబీఐ ఇంతకాలం చేతులు ముడుచుకు కూర్చోలేదని నిరూపించేందుకు, ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న భాస్కర్ రెడ్డితో సహా ఒకరిద్దరిపై ఛార్జ్ షీట్‌ దాఖలు చేసి, సుప్రీంకోర్టు మరీ గట్టిగా మొట్టికాయలు వేయకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించవచ్చు.

మహాభారతం చెప్పుకొంటున్నప్పుడు కురు పాండవుల గురించి, రామాయణం చెప్పుకొంటున్నప్పుడు రామరావణుల గురించి చెప్పుకోవడం ఎంత అనివార్యమో వివేకా హత్యకేసు ప్రస్తావన వచ్చినప్పుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోకతప్పదు.

ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని కోరుతూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జూలై 3న సుప్రీంకోర్టు విచారణ జరుపనుంది. ఈలోగా ఈ కేసు సీజన్‌కి-2 మొదలైపోతుంది కనుక కంటిన్యూటీ ఎక్కడా దెబ్బ తినదు.

ADVERTISEMENT
Latest Stories