మహాయోధుడు కర్ణుడు వద్ద అనేక దివ్యస్త్రాలు ఉండేవి. కానీ కురుక్షేత్ర యుద్ధంలో అవేవీ ఆయనకు ఉపయోగపడలేదు. చివరికి అర్జునుడి చేతిలో నిసహాయంగా మరణించాడు. ఇది వాస్తవం!
కానీ ఏపీలో జరుగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ‘పద్మవ్యూహంలో ఒంటరిగా ప్రవేశించబోతున్న అర్జునుడిని నేనని’ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఇది ఎవరికీ తెలియని కొత్త పురాణమే! కానీ ఆయన పరిస్థితి చూస్తే అర్జునుడు కాదు… కర్ణుడని అందరికీ అర్దమవుతుంది.
ముందుగా కర్ణుడు దానగుణం గురించి చెప్పుకుంటే, ఆయన తన స్వార్జితాన్ని, చివరికి తన శరీరంలో భాగంగా ఉన్న కవచకుండలాలను దానం చేశాడు. అందుకే యుగాలైన దాన కర్ణుడుగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు.
కానీ మన అభినవ దానకర్ణుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన్నట్లుగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి దానం చేస్తున్నారు. ఆ భారం ప్రజలపైనే వేస్తూనే ‘మేలు’ చేస్తున్నానని చెప్పుకొంటున్నారు. ఆ ‘మేలు’ని మరిచిపోకుండా ఎన్నికలలో వైసీపి బటన్ నొక్కి గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు.
ఇది దాన కర్ణుడు అధ్యాయం కాగా మహావీరుడి ‘యుద్ధ అధ్యాయం’ వేరేగా చెప్పుకోవలసి ఉంది.
ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడుకి ఏ దివ్యస్త్రాలు ఉపయోగపడన్నట్లే మన మహాయోధుడుకి కూడా గత ఐదేళ్ళుగా సిద్దం చేసుకున్న ఏ ఆయుధాలు ఉపయోగపడటం లేదు. ఆ దివ్యస్త్రాలేమిటో అందరికీ తెలుసు. అయినా యుద్ధ రంగంలో అడుగుపెట్టబోతున్నాము కనుక ఓసారి ఆయుధాలు చెక్ చేసుకుంటే మంచిదే.
1. సంక్షేమ పధకాలు, 2. వైసీపి రంగులు, 3. పేర్లు మార్పులు, 4. మూడు రాజధానులు, 5. విశాఖ రాజధాని, 6. ప్రతిపక్షాలపై కేసులు, వేధింపులు, 7. చంద్రబాబు నాయుడు అరెస్ట్, 8. మోడీ, అమిత్ షాల పట్ల విధేయత, 9. వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు, 10. మా నమ్మకం, మా భవిష్యత్, సిద్దం, యుద్ధం, కలలు పోస్టర్స్, సిద్దం సభలు.
ఈ ఆయుధాలు ఏవీ పనిచేయడం లేదని తోడేళ్ళ గుంపు మద్యలో ‘సింగిల్ సింహం’లా మిగిలిపోయానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పుకుంటున్నారు.
ఇంతకాలం ఆ తోడేళ్ళ గుంపులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ నలుగురు మాత్రమే ఉండేవారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ తోడేళ్ళ గుంపు ఇంకా ఇంకా పెరిగిపోతోంది.
తాజాగా ఆ తోడేళ్ళ గుంపులో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన వెనకే బీజేపీ నేతలందరూ చేరిపోతున్నారు. ఆ తోడేళ్ళ గుంపులోనే తోడబుట్టిన చెల్లి వైఎస్ షర్మిల, ఆమె భర్త అనిల్, మరోచెల్లి సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా చేరిపోయారు.
ఇప్పుడు వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ కూడా చేరిపోయారు! ఆమె కూడా తన భర్త హంతకులను జగన్ కాపాడుతున్నారని, కనుక ఈసారి ఎన్నికలలో వైసీపికి ఓట్లు వేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఆహా… ఏమిటీ జగన్ సౌభాగ్యం? అని అనుకోకుండా ఉండగలమా? ఇంతకీ మానవాడు అర్జునుడా… కర్ణుడా… ఎనీ డౌట్?





