ఒంటరి మహిళ భారం ఇలా దించుకొందామా?

YSR-Ontari-Mahila-Pension-scheme-ఎన్నికలలో గెలిచేందుకు గొప్పగా పధకాలు ప్రకటించడం, అధికారంలోకి వచ్చాక కొంతకాలం కొనసాగించి ఆ తరువాత మెల్లమెల్లగా ఒక్కో పధకానికి నిబందనలు, ఆంక్షలు విధిస్తూ లబ్దిదారుల భారాన్ని తగ్గించుకొనేందుకు గుట్టుగా జీవోలు జారీ చేయడం… ఇదీ వైసీపీ ప్రభుత్వం పరిస్థితి.

ఇప్పటికే అమ్మఒడి… విద్యా దీవెన పధకాలకు రకరకాల నిబందనల పేరుతో కత్తెర వేసిన వైసీపీ ప్రభుత్వం తాజాగా ఒంటరి మహిళలకు ఇస్తున్న రూ.2,250 పింఛను భారాన్ని తగ్గించుకొనేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఈ పధకానికి వయోపరిమితి 50 ఏళ్ళకు పెరిగింది.

ADVERTISEMENT

జగన్ ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన పధకాలలో వైఎస్సార్ పింఛను కానుక కూడా ఒకటి. ఈ పధకం కింద ఇప్పటివరకు 35 ఏళ్ళు పైబడిన ఒంటరి మహిళలకు, వివాహం కానీ మహిళలకు, వివాహమై భర్త నుంచి విడిపోయిన వారికి ఈ పధకం కింద పింఛను ఇచ్చేదీ. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి 50 ఏళ్ళు పైబడిన ఒంటరి మహిళలకే ఈ పధకానికి అర్హులు.

ఒకవేళ భర్త నుంచి విడిపోయుంటే, విడిపోయిన 12 నెలల తరువాతే ఈ పధకానికి దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. అటువంటి మహిళలు తాము భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నామనే దృవీకరణ పత్రాన్ని కూడా దరఖాస్తుతో సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఇక వివిద కారణాలతో పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు పట్టణ ప్రాంతాలలో 35 ఏళ్ళు, గ్రామీణ ప్రాంతాలలో 30 ఏళ్ళకు ఈ పింఛన్ ఇస్తుండగా ఇప్పుడు దానినీ రెండు ప్రాంతాలలో 50 ఏళ్ళకు పెంచింది. ఈ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొనే అవివాహిత మహిళలు దరఖాస్తుతో పాటు తమకు పెళ్ళి కాలేదని స్థానిక తహశీల్దార్ నుంచి సర్టిఫికేట్‌ను కూడా తప్పనిసరిగా సమర్పించాలని, కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఆర్ధికసాయం అందడంలేదని దృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలనే నిబందన విధించింది.

ఈ పధకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకొంటున్న ఒంటరి మహిళలకు ఈ వయోపరిమితి పెంపు నిబందన వర్తిస్తుందని, పాత లబ్దిదారులకు వర్తించదని, వారికి యదాతధంగా పింఛన్ అందిస్తామని చెప్పడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం.

ఒంటరి మహిళల జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది కనుకనే ఈ పధకం అమలుచేస్తున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి మొదట్లో గొప్పగా చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు ఈ పధకంలో వయోపరిమితిని ఒకేసారి 50 ఏళ్ళకు పెంచేయడం ద్వారా 30-50 ఏళ్ళ లోపు వయసున్న ఒంటరి మహిళలందరినీ తెలివిగా ఈ పధకంలో నుంచి తప్పించేశారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసుకోకుండా సంక్షేమ పధకాలు ప్రకటించేసి ఇప్పుడు వాటిని అమలుచేయలేక ఈవిదంగా ఒక్కో పదకాన్ని కొత్త కొత్త నిబందనలు విధిస్తూ లబ్దిదారుల భారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ కంచంలో అన్నం పెట్టి వెనక్కు తీసేసుకొనే వాడిని ఎవరూ క్షమించలేరనే వాస్తవాన్ని జగన్ ప్రభుత్వం గ్రహించిందో లేదో?

ADVERTISEMENT
Latest Stories