వైసీపీ ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా శ్రమించాలని, పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా మీదే అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణులకు తాడేపల్లి ప్యాలస్ లో దిశా నిర్దేశం చేస్తున్నారు.
ప్రజల తరుపున ప్రభుత్వం పై పోరాటాలు చెయ్యాలని, ఇప్పటికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల సమయం ముగిసిపోయిందని, ఇంకా మూడేళ్ళ సమయమే ఉండడంతో రెండేళ్లపాటు పార్టీ ని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత, పార్టీ తరుపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత మీదే అంటూ పార్టీ బాధ్యతను పార్టీ క్యాడర్ భుజాన పెట్టేసారు జగన్.
వైసీపీ 2.0 బాధ్యత మొత్తం మీదే అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తుంటే మరి కూటమి 2.0 బాధ్యత ఎవరు తీసుకుంటారు. పార్టీ అధినేతలుగా బాబు, పవన్ పదేపదే తమ మధ్య ఉన్న బంధాన్ని, తమ పార్టీల మధ్య ఉన్న రాజకీయ అనుబంధాన్ని 15 ఏళ్ళ పాటు కొనసాగించాలంటూ ఇరు పార్టీల క్యాడర్ కి గట్టిగానే చెపుతున్నారు.
అలాగే ఇరు పార్టీ ల నాయకులకు కూడా నియోజకవర్గంలో ఎదురవుతున్న చిన్న చిన్న రాజకీయ సమస్యలను చర్చల ద్వారా సామరస్య పద్దతిలో పరిష్కరించుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే వైసీపీ ని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ క్యాడర్ ని సిద్ధం చేస్తున్నారు జగన్. మరి కూటమి ని అధికారంలోకి తెచ్చేందుకు బాబు, పవన్, లోకేష్ తమ తమ పార్టీ క్యాడెర్ ని లీడర్లను సిద్ధం చేస్తున్నారా.? ఆ దిశగా వారికీ సూచనలు చేస్తున్నారా.?




