రెండు తెలుగు రాష్ట్రాలలో విచారణల పర్వం కొనసాగుతుంది అనేలా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కేసు తాలూకా ఈడీ విచారణలతో వైసీపీ నేతలు, తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసులో బిఆర్ఎస్ నేతలు సిట్ ముందు హాజరవుతున్నారు.
అయితే నిన్న తనవంతుగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ ముందు హాజరవగా నేడు ఆ ఛాన్స్ మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని వరించింది. ఇక ఇప్పటికే ఈ కేసు తాలూకా అనేకమంది వైసీపీ నేతలు అరెస్టులయ్యి జైలు జీవితం గడుపుతున్నారు.
అలాగే అటు తెలంగాణ విచారణల విషయానికొస్తే ఫోన్ టాపింగ్ కేసులో నిన్న బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ విచారణను ఎదుర్కోగా, నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ ముందుకెళ్లారు. ఇక ఈ కేసు తాలూకా విచారణలో ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు సైతం చట్టం ముందు సిట్ అయ్యారు.
అయితే ఏపీలో విచారణ ఎదుర్కుంటున్న వైసీపీ మాత్రం ఎటువంటి హంగామా చేయకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తుంటే తెలంగాణలో మాత్రం నిన్న హరీష్ విచారణకు, నేడు కేటీఆర్ హజరుకి బిఆర్ఎస్ బలప్రదర్శనకు దిగింది. ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూసింది.
2018, 19 ఎన్నికలలో అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో జగన్ కలిసి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నాడు విజయంలోనే కాదు నేడు ఓటమిలోను, తాజాగా జరుగుతున్న పార్టీ నేతల విచారణలో కూడా ఈ రెండు పార్టీల నడక కలిసే సాగడం ఏ స్క్రిప్ట్ లో భాగమనాలో.!
అయితే ఏపీ లిక్కర్ కేసు విచారణలో పాల్గొన్న విజయ సాయి వైసీపీ కి వ్యతిరేకంగా ప్రకటనలు చేయగా, బిఆర్ఎస్ కు ప్రస్తుతానికి అటువంటి పరిస్థితులు లేవు. అటు హరీష్, ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా పార్టీ లైన్ కి కట్టుబడి, ఒకే స్టాండ్ మీద రేవంత్ సర్కార్ పై ఎదురుదాడి చేస్తున్నారు.
మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న వైసీపీ, బిఆర్ఎస్ నేతల విచారణలో ఏ పార్టీ నేతలు కడిగిన ముత్యాల మాదిరి బయటకొస్తారో.? ఏ పార్టీ నేతలు అవినీతి మరకలు వేసుకుని లోపలికి వెళ్తారో అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.




