మొన్న రాప్తాడు జగన్ సిద్ధం సభలో వైసీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై దాడికి సిద్దమయ్యి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ పై విచక్షణరహితంగా దాడి చేసి చావబాదారు. కనీసం ఆ ఘటన పై పోలీస్ ఉన్నతాధికారుల స్పందన కూడా కరువయ్యింది అంటేనే అర్ధమవుతుంది ఇటువంటి దాడులను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నది ఎవరనేది.
పోలీస్ అధికారుల తీరు అలా ఉంటే.., వైసీపీ నాయకుల స్పందన మరో రకంగా ఉంది. మీడియా స్వేచ్ఛ మీద జరిగిన దాడిని ఖండించాల్సిన ప్రభుత్వం అది చేయకుండా వారిని ప్రోత్సహించేలా మాట్లాడడం వారి పార్టీ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. బూతులతో పాపులారిటీ తెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని ఆ మీడియాలో పని చేస్తున్న వ్యక్తి కాబట్టి కొట్టి వదిలేసారు అదే ఆ మీడియా యజమాని దిరికితే కీలుకు కీలు, కాలుకు కాలు తీసేస్తారు అంటూ వ్యాఖ్యానించడంలో పరమార్థం ఏమిటో..?
రామోజీ రావు, రాధా కృష్ణా, టీవీ 5 నాయుడు, మహాటీవీ వంశీ కృష్ణా…ఈ నలుగురిని మా పార్టీ సభలకు వస్తే మా పార్టీ కార్యకర్తలు మోపు దాడి చేసి వాళ్ళ కాళ్ళు, కీళ్లు విరగొట్టడం కామన్ అంటూ మీడియా ఛానెల్స్ అధిపతుల మీద ఇటువంటి వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలు చేయడం దాడులను ప్రోత్సహిస్తున్నట్టు కాదా..? ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5 అంటూ ముఖ్యమంత్రి జగన్ ఒక పక్క, ఇలా మోపు దాడి చేస్తే ఎవ్వరు ఏమి చేయలేము అంటూ దాడులను ప్రోత్సహిస్తున్న నాయకులు మరో పక్క చేరి తమ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి మెసెజ్ ఇస్తున్నారు.
వీరి వ్యాఖ్యలకు తగ్గట్టే.., కర్నూల్ లో ఈనాడు ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు అధికార పార్టీ కార్యకర్తలు. అధికార పార్టీ కి మరో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన తమ గళాల్ని వినిపించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తారు జర్నలిస్టులు. ఇటువంటి వారి పై తమ అధికారాన్ని వినియోగించి తమ పార్టీ అనుచరులతో దాడులకు తెగబడడం అధికార పార్టీ హింసా ప్రవృత్తిని తెలియచేస్తుంది అంటూ జనసేన అధినేత పవన్ మండిపడ్డారు.
సర్కారు వైఫల్యాలను, అవినీతిని, అక్రమాలను బయటపెట్టినందుకే ఇటువంటి దాడులుకు తెగబడుతున్నారు, ఇది పత్రికా స్వేచ్చకు విఘాతం వంటిదే అంటూ పవన్ దాడిని ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల ఈదాడులను ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛను సమాధి చేస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా – సుసంపన్నంగా ఉంది అంటున్న వైకాపా నాయకులు ఈ దాడులే అభివృద్ధి అంటారా..?
తమను వ్యతిరేకిస్తే సొంత కుటుంబ సభ్యులనైనా కనికరించేది లేదని సునీతా, షర్మిల విషయంలో రుజువయ్యింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని న్యాయస్థానాలను ఆశ్రయించారు జగన్ సోదరీమణులు షర్మిల, సునీతా. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభదత్రాలు కరువయ్యావని ఈ దాడులతో మరోసారి రుజువుచేసారు వైకాపా నాయకులు.
ఒక పత్రికకు, ఛానెల్ కు అధినేతగా ఉంటూ మరొకరి పత్రికల పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జగన్ వైఖరిని తెలియచేస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా సాక్షి మీడియా మీద ఇదే తరహా దాడులను ప్రోత్సహిస్తే ఇలానే దాడులను వెనకేసుకొచ్చేవారా..? ప్రభుత్వాన్ని విమర్శించి కాబట్టి దాడి చేసారు అంటూ సర్దుకుపోగలరా..? అధికార పార్టీని విమర్శిస్తే దాడి చేస్తాం అందుకు సిద్దమైతేనే మా పార్టీకి ఓటేయండి అని అడిగి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా వైసీపీ పార్టీకి అంటూ ప్రజాస్వామ్య వాదులు ఈ దాడులను ఖండిస్తున్నారు.




