రాబోయే ఎన్నికలలో ప్రధాన అజెండా?

YSRCP-BJP-JanaSena-TDP-Amaravati2024లో జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో ప్రధాన అజెండా ఏమిటి? అని ప్రశ్నించుకొంటే వైసీపీ అజెండా ‘సంక్షేమ పధకాలు’ కాగా టిడిపి, జనసేన, బిజెపిల అజెండా ‘అమరావతి-అభివృద్ధి’ కాబోతోంది. అధికార ప్రతిపక్షాలు తమ తమ అజెండాలపైనే ప్రధానంగా చర్చ జరిగేలా చేసేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయం.

ఒకవేళ వైసీపీ ‘సంక్షేమ పధకాల అజెండా’ను బాగా హైలైట్ చేసుకోగలిగితే అది ఎన్నికలలో లబ్ధి పొందుతుంది. ఒకవేళ ప్రతిపక్షాలు అమరావతి అజెండాతో ప్రజలను మెప్పించగలిగితే అవి లబ్దిపొందుతాయి.

ADVERTISEMENT

వైసీపీ సంక్షేమ పధకాల అజెండా గురించి ఇంతకు ముందే వేరేగా చెప్పుకొన్నాము కనుక దాని గురించి మళ్ళీ చర్చ అనవసరం. కానీ చాలా దూరదృష్టితో ఆలోచించి అది పన్నిన ‘మూడు రాజధానుల’ వ్యూహమే వచ్చే ఎన్నికలలో వైసీపీ మెడకు ఉరితాడులా చుట్టుకొనే అవకాశం కనిపిస్తోంది.

మూడు రాజధానుల పేరుతో ప్రజల మద్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి వాటితో టిడిపి, జనసేనలను రాజకీయంగా రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో అడుగుపెట్టనీయకుండా చేయాలని వైసీపీ పెద్ద వ్యూహమే పన్నింది. ఒకవేళ అది మూడు రాజధానులను ఏర్పాటు చేయగలిగి ఉండి ఉంటే తప్పకుండా దాని వ్యూహం ఫలించి ఉండేదేమో?కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నా మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసింది.

దాని మూడు రాజధానులు ప్రతిపాదనను కానీ రాష్ట్ర ప్రజలు కూడా నిర్ద్వందంగా తిరస్కరించడం వైసీపీ ఊహించని విషయమే. ఒకవేళ రాష్ట్ర ప్రజలు కూడా మూడు రాజధానులకు మొగ్గు చూపి ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కనబడకుండా పోయేవి. కానీ అలా జరుగలేదు.

ప్రజాభీష్టాన్ని గమనించిన టిడిపి, జనసేన, బిజెపిలు ఈ ప్రతిపాదనను, వైసీపీ అనాలోచిత నిర్ణయాన్ని సమర్ధంగా ఎండగట్టాయి. బిజెపితో సహా అన్ని పార్టీలు అమరావతే రాజధానిగా ఉండాలని తేల్చి చెప్పేశాయి. పైగా మూడు రాజధానుల విషయంలో కూడా వైసీపీకి చిత్తశుద్ధి లేదని స్వయంగా నిరూపించుకొంది. ఇది మరో ఘోరమైన తప్పిదమే అని భావించవచ్చు.

కనుక రాబోయే ఎన్నికలలో అమరావతి-మూడు రాజధానులు అంశంపై ఎంతగా చర్చ జరిగితే అంతా వైసీపీకి నష్టం జరుగక తప్పదు. వైసీపీ అధినేత జగన్‌ ఎంతో దూరం ఆలోచించి అమలుచేసిన ఈ వ్యూహం కూడా బెడిసికొట్టడంతో ఈ వ్యూహాలే వైసీపీ కొంపముంచే ప్రమాదం కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories