వైసీపి ప్రభుత్వం కేంద్రాన్ని మంచి చేసుకొంటూ, అప్పులు తెచ్చుకొని సంక్షేమ పధకాల పేరుతో ప్రజలను ప్రలోభపెడుతూ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జైల్లో వేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇన్ని చేసినా ఇంకా వైసీపిని ఓటమి భయం వెంటాడుతున్నట్లే ఉంది.
బహుశః అందుకే ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు పైగా సమయం ఉన్నప్పటికీ ‘సామాజిక సాధికార యాత్ర’ పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలతో బస్సు యాత్రలు, బహిరంగ సభలు నిర్వహింపజేస్తోంది. అంటే చంద్రబాబు నాయుడుపై వరుస పెట్టి కేసులు నమోదు చేసి బయటకు రాకుండా కట్టడి చేస్తున్నా, ఇంకా వైసీపి కీడు శంకిస్తూనే ఉందన్న మాట!
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపించగలిగినందుకు వైసీపి నేతలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో సానుభూతి పెరిగి అది టిడిపి, జనసేనలకు వరంగా, అదే తమకు శాపంగా మారుతుందేమోననే భయమే వారిని హడావుడిగా ఈ బస్సు యాత్రలకు బయలుదేరదీసి ఉండవచ్చు.
వైసీపి నేతలు ఎవరూ ఊహించని విదంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజల మద్యకు రావడంతో ఆమె రాష్ట్రంలో మహిళలలో సెంటిమెంట్ రగిలిస్తారమో అనే భయం కూడా వైసీపి నేతలలో ఉండి ఉండవచ్చు.
అంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేసినప్పటికీ, మోడీ, అమిత్ షాలు మౌనంగా ఉండిపోయి తమ చర్యకు పరోక్షంగా ఆమోదం తెలుపుతున్నప్పటికీ, ఇంకా జరగరానిదేదో జరిగిపోవచ్చునని వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లు ఉంది. ఆ అభద్రతాభావంతోనే మంత్రులను బస్సు యాత్రలకు బయలుదేరదీసిన్నట్లున్నారు.
అయితే ప్రజలు ఆయనను నమ్మి భారీ మెజార్టీతో ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు, దానిని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలాగ అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపి ఉండి ఉంటే నేడు ఇంత భయం, ఇంత అభద్రతాభావం ఉండేది కాదు కదా?కేసీఆర్, ఆయన మంత్రుల లాగ జగన్, మంత్రులు కూడా ధైర్యంగా “ఇదిగో మేము చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయండి,” అని అడిగి ఉండేవచ్చు.
కానీ ఓ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కంటే సంక్షేమ పధకాలను అమలుచేయడం, రాజకీయ వేధింపులతో ప్రతిపక్షాలను కట్టడి చేసి గెలవడమే చాలా సులువు అని వైసీపీ అధినేత భావించబట్టే నేడు ఆ పార్టీ నేతలకు ఇంత భారీ మెజార్టీ ఉన్నప్పటికీ వైసీపి నేతలందరూ ఇంత అభద్రతాభావంతో తిరగవలసివస్తోందని చెప్పక తప్పదు.




