జగన్ ప్రసంగాలకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో కానీ తన వేలుతో తన కన్ను పొడుచుకునేలా చేస్తున్నారని చెప్పక తప్పదు.
జగన్ ఎన్నికల స్క్రిప్టులో సింహాలు, పులులు, నక్కలు, తోడేళ్ళు, పందులు వంటి అనేక అడవి జంతువులు కనబడుతుండేవి. క్రీస్టియన్ మతస్తుడైన జగన్ చేత రామాయణం, శ్రీరాముడు, మహాభారతం, పాండవులు, కౌరవులు, అర్జునుడు, పద్మవ్యూహం వంటి పురాణ గాధలు చెప్పిస్తుంటారు.
చివరికి స్క్రిప్ట్ రైటర్స్ కూడా ఆయనకు శల్య సారధ్యం చేసి నిలువునా ముంచేశారు. కూటమి వైసీపీని ఎన్నికలలోఓడించి వదిలిపెట్టేసింది. కానీ స్క్రిప్ట్ రైటర్స్ మాత్రం జగన్ని ఇంకా ఇంకా ఓడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఎన్నికలలో తనని ముంచేసిన అందరినీ జగన్ వదిలించుకున్నారు కానీ స్క్రిప్ట్ రైటర్స్ని మార్చడం మరిచిపోయిన్నట్లున్నారు. అందుకే వారు ఉడతా భక్తిగా జగన్ చేత ఇటువంటి మాటలు మాట్లాడిస్తున్నారేమో?
మొన్న రాప్తాడులో ‘పోలీసుల బట్టలూడదీయిస్తామని’ ఆయన చేత చెప్పించారు. అందుకు ఆయన ఇంకా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఆ వేడి చల్లారాక మునుపే ఆయన నోటితోనే ‘చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని, ప్రజలు ఒక్క తన్ను తంతే అవతల పడ్డామని’ చెప్పించారు.
గురువారం తాడేపల్లి ప్యాలస్లో ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు జగన్ ఏమన్నారంటే, “న్యూటన్ సూత్రం ప్రకారం ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. మంచి చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకుని ఒక నాయకుడు పాలన చేయాలి.
అలా కాకుండా అధికారం ఉందని దూరహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు ఖచ్చితంగా మొట్టికాయ వేస్తారు. ఏపీ, తమిళనాడు ప్రజలు వన్ సైడ్గా ఇచ్చే తీర్పులు చూశాము. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితిలోకి వెళ్తారు,” అని అన్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్నారు కనుక వచ్చే ఎన్నికలలో కూటమి దారుణంగా ఓడిపోతుందని జగన్ చెప్పాలనుకున్నట్లు అర్దమవుతూనే ఉంది.
కానీ తన దురహంకారం వల్లనే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిందని, ఆంధ్రా ప్రజలు ఒక్క తన్ను తంతే అవతల పడ్డామని జగన్ చెప్పుకున్నట్లు అనిపిస్తుంది.
జగన్ మాటలు విని సమావేశానికి హాజరైన వైసీపీ నేతలే ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. జగన్ తను, తన పాలన, ప్రజల తీర్పు గురించి ఈవిదంగా చెపితే నవ్వుకోరా?
పాపం జగన్కి ఇటువంటి స్క్రిప్ట్స్ ఎవరు వ్రాసిస్తున్నారో కానీ ఇంకా ఇలాగే దురహంకారంతో విర్రవీగితే వచ్చే ఎన్నికలలో వైసీపీకి సింగిల్ డిజిట్ రాకపోవచ్చని ఆయన చేతే చెప్పించారు. కానీ కూటమికి సింగిల్ డిజిట్ రాదని వారు తన చేత చెప్పించారని జగన్ అనుకుంటున్నారు పాపం!
స్క్రిప్ట్ రైటర్స్కి కూడా ఆయనపై ఇంత పగ దేనికో.. ఎందుకు ఆయనపై ఈవిదంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారో? జగన్ వారికేమి అన్యాయం చేశారో?




