ఎదుటవారిని ఒక వేలితో చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపిస్తుంటాయి… కానీ వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ఇది మరిచి ఏదో మాట్లాడితే మరేదో గుర్తు వస్తుంటుంది.
రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ వారి సొంత మీడియా విమర్శలు మొదలుపెట్టాయి. ‘మందులు లేవు.. మాస్కులు లేవు’ అంటూ వైసీపీ సొంత మీడియాలో నేడు ఓ కధనం వచ్చింది.
కరోనా కేసులో క్రమంగా పెరుగుతున్నా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు, ఏర్పాట్లు, వాక్సినేషన్ వంటివి ఏర్పాటు చేయలేదని, ఈ కారణంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని దానిలో పేర్కొంది. కనీసం ఆస్పత్రులతో మాస్కులు కూడా లేవని వైద్యులు, సిబ్బంది పిర్యాదు చేస్తున్నారని దానిలో పేర్కొంది.
కరోనా, మాస్కులు గురించి వైసీపీ మాట్లాడితే ఎవరికైనా డాక్టర్ సుధాకర్ టక్కున గుర్తువస్తారు. ఇదివరకు జగన్ హయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఆస్పత్రిలో కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా లేవని మీడియా ముందుకు వచ్చి చెప్పినందుకే ఆయనని ఎంత దారుణంగా వేదించారో అందరూ చూశారు.
కరోనా సమయంలో తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ రోగులకు చికిత్స అందించిన డాక్టర్ సుధాకర్ని మానసిక రోగిగా చిత్రీకరించి, నడిరోడ్డుపై అర్ధనగ్నంగా నిలబెట్టారు. చివరికి మానసిక చికిత్స కూడా చేయించారు. ఆ వేధింపులతో నిజంగానే మానసికంగా క్రుంగిపోయి గుండెపోటుతో చనిపోయారు.
బహుశః వైసీపీ దాని సొంత మీడియా ఇదంతా మరిచిపోయి ఉండవచ్చు. కానీ ప్రజలకు, ముఖ్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కనుక ‘మందులు, మాస్కులు’ గురించి వైసీపీ మాట్లాడితే, ఆనాడు వైసీపీ చేసిన ఈ నిర్వాకమే ప్రజలకు గుర్తు చేసినట్లవుతుందని గ్రహిస్తే మంచిది.
వైసీపీ దాని సొంత మీడియా ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం పరిశీలించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అన్నీ ఏర్పాట్లు చేయడం చాలా మంచిది. ఎందుకంటే కరోనా వ్యాపిస్తే దానిని కట్టడి చేయడం చాలా కష్టం. ఆలోగా అనేక మంది ప్రాణాలు కోల్పోతారని గత చరిత్ర చెపుతోంది.




