వైసీపి అధినేత, ఆ పార్టీ నేతలు అందరూ పార్టీలను, రాష్ట్రంలోని ప్రజలను ‘కులద్దాలు’ పెట్టుకొని చూస్తుంటారని అందరికీ తెలుసు. కానీ గురివింద గింజ తన నలుపెరుగదన్నట్లు పార్టీలో, ప్రభుత్వంలో, చివరికి టీటీడీ వంటి పవిత్ర పుణ్య క్షేత్రాలలో కూడా రెడ్లతో నింపేసుకొని రెడ్డి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపి, టిడిపి నిన్న ప్రకటించిన తొలి జాబితాలో కమ్మవారికే ఎక్కువ సీట్లు కేటాయించుకుందని వేలెత్తి చూపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
రాష్ట్రంలో 7-8% ఉన్న కమ్మవారికి టిడిపి తొలి జాబితాలో 21 సీట్లు ఇచ్చిందని వైసీపి ఏడుపుకి అర్ధమే లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అంత కంటే తక్కువ జనాభా (4-5%) ఉన్న రెడ్లకు 17 సీట్లు ఇచ్చింది కనుక! ఇంకా మిగిలిన 57 సీట్లలో మరికొన్ని వారికి కూడా దక్కే అవకాశం ఉంటుంది కనుక!
గత ఎన్నికలలో వైసీపి ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లలో 52 సీట్లు రెడ్లకే ఇచ్చుకుంది. ఈసారి కూడా ఆలాగే ఇచ్చుకోబోతోంది.
కానీ ఈసారి టిడిపి, జనసేన, కుదిరితే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని వాటితో సీట్ల సర్దుబాట్లు చేసుకుంటోంది. వాటితో సర్దుబాట్లు చేసుకుంటున్నా (కమ్మ, రెడ్డి) వర్గాలకు సమానంగా ప్రాధాన్యం ఇస్తోంది. వారితో పాటు జగన్ చెప్పుకునే బడుగు బలహీన వర్గాలకు కూడా సీట్లు కేటాయించింది కదా?
జగన్మోహన్ రెడ్డి ప్రతీ సభలో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ వారికీ కొన్ని సీట్లు, పదవులు కట్టబెట్టినప్పటికీ, వైసీపిలో వారికి ఏ పాటి విలువ ఉందో బయటకు వస్తున్నవారే స్వయంగా చెపుతున్నారు కదా?కానీ టిడిపిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎప్పుడూ సముచిత గౌరవం, టికెట్లు, పదవులు ఇస్తూనే ఉంది.
జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసమే నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని అంటున్నారని, అందుకే వారికి సంక్షేమ పధకాలు ఇస్తున్నారని అందరికీ తెలుసు. తెలియనివారు ఎవరైనా ఉంటే బటన్ నొక్కుడు, సిద్ధం సభలలో జగన్ స్వయంగా చెప్పుతున్నారు కూడా.
కనుక అన్ని వర్గాలని తన అవసరాలకి నయన్నో భయాన్నో వాడేసుకుంటూ, వారిపై కపట ప్రేమ నటిస్తూ మళ్ళీ ప్రతిపక్షపార్టీలను వేలెత్తి చూపడం సిగ్గుచేటు.
సరే! టిడిపి రెడ్లను కాదని కమ్మవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందనుకున్నా, మరి వైసీపిలో ఎంతమంది కమ్మవారికి పదవులు, సీట్లు ఇచ్చింది?వారిలో ఏ ఒక్కరికైనా పార్టీలో, ప్రభుత్వం సముచిత గౌరవం లభిస్తోందా? కమ్మవారికి బలం ఉన్న చోట కూడా సోషల్ ఇంజనీరింగ్ సాకుతో వేరే వర్గాలకు టికెట్స్ ఇచ్చి వారిని అవమానిస్తూనే ఉంది కదా?
మొదట టిడిపి, జనసేనలను కలవకుండా చేయడానికి వైసీపి విశ్వప్రయత్నాలు చేసింది. కానీ సాధ్యపడకపోవడంతో సీట్ల విషయంలో జనసేనకు అన్యాయం జరిగిపోయిందంటూ రెచ్చగొట్టి వియదీసేందుకు లేదా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందిప్పుడు.
ఇవన్నీ సరిపోవన్నట్లు ఇప్పుడు టిడిపిలో కమ్మ, రెడ్డి, కాపు అంటూ చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈసారి 175/25 సీట్లు మేమే గెలుస్తామనే నమ్మకం ఉంటే ఇలా చిల్లర రాజకీయాలు చేయడం దేనికి?అంటే 175/25 ఉత్తుత్తి మాటలనే కదా అర్దం?




