రాజకీయాలలో వైసీపీ రాజకీయాలు వేరయా అన్న చందంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేసులు, అరెస్టులు, దాడులే తమ పార్టీ సిద్ధాంతాలు అనేలా వ్యూహాలు పన్నుతున్నట్టుంది జగన్ పాలన. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసులు మోపి అరెస్ట్ చేసి కేసులు – అరెస్టుల పర్వానికి అంకురార్పణ చేశారు.
చంద్రబాబు అరెస్టుతో నిస్సహాయంలో ఉన్న టీడీపీ శ్రేణులకు టీడీపీ – జనసేన పొత్తు ఒక ఆక్సిజన్ లా పనిచేసిందనే చెప్పాలి. చంద్రబాబు – లోకేష్ యాత్రలతో ఉత్సహంలో ఉన్న టీడీపీ శ్రేణులకు బాబు అరెస్టుతో జగన్ బ్రేకులు వేశారు. జగన్ వేసిన బ్రేకులతో ఆగిన సైకిల్ ఇంకా ప్రజాక్షేత్రంలోకి రానేలేదు. పొత్తుతో ఒకటైన టీడీపీ – జనసేన ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తల మద్దతు సంపాదించింది.
అందులో భాగంగా అవనిగడ్డలో నాలుగో విడత పవన్ వారాహి యాత్రకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మద్దతు పలికారు. బుధవారం జరిగే పెడన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం కిరాయి మూకలతో దాడులకు దిగబోతుందని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అరెస్టులతో అంకురార్పణ చేసిన వైసీపీ ప్రభుత్వం దాడులతో తన రాజకీయాన్ని కొనసాగించాలని భావిస్తుందా? అనే సందేహం ఇరు పార్టీ నేతలలో మొదలైంది.
ఇప్పుడు జనసేన సభలకు టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు, అలాగే లోకేష్ యువగళం మొదలైతే జనసేన క్యాడర్ టీడీపీ సభలకు వచ్చి మద్దతు తెలియచేస్తారు అని భావించే రెండు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి జగన్ ఇటువంటి పథకాలు రచిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. మా సభలకు మీ గుండాలను పంపి దాడులు చేయాలని భావించే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని పవన్, జగన్ ను హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే అరెస్టులు,వ్యతిరేకిస్తే దాడులు అంటూ
ప్రభుత్వాలు ముందుకెళ్తే ప్రజాస్వామ్యానికి విలువెక్కడా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి చోటెక్కడా? ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలే కానీ విద్వేషాలు రెచ్చకొట్టకూడదు. కేసులు, అరెస్టులు, దాడులతోనే రాజకీయాలు చేయాలని వైసీపీ నేతలు భావిస్తే ప్రభుత్వాలు మారితే “నీవు నేర్పిన విధ్యేగా నీరజాక్షా” అన్న సామెత అప్పటి ప్రభుత్వాలు వల్లెవేస్తారని గ్రహిస్తే మంచిది.



