గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయవ్యవస్థ మరియు న్యాయాన్ని అందించే జడ్జీల వ్యవహారం ఇటీవల కాలంలో సంచలనంగా మారుతున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం స్పందించి, ఎవరి హద్దులలో వాళ్ళు ఉండాలని సూచించారు. ఇది చెప్పిన తర్వాత కూడా తిరుపతి వేదికగా తాజాగా ఓ వివాదం వెలుగు చూసింది.
జిల్లా జడ్జి పేరు వేసుకున్న కారులో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో ఉండడం సంచలనంగా మారింది. ఉపాధి హామీ పధకంలో అంబుడ్స్ మెన్ గా ఉన్న నర్సారాయుడు తన కారు నెంబర్ ప్లేట్ పై జిల్లా జడ్జిగా రాయగా, లోపలేమో పెద్దిరెడ్డి ఫోటో దర్శనమిచ్చింది. ఓ జడ్జి వాడుతోన్న వాహనంలో వైసీపీ మంత్రి ఫోటో ఎలా ఉందంటూ ఈ అంశం వివాదాస్పదంగా మారింది.
అసలు కారుపై జడ్జి పేరు రాయడమే తప్పు కాగా, అందులోనూ ఆ కారులో వైసీపీ నేత పెద్దిరెడ్డి ఫోటో ఉండడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. కోర్టులను మేనేజ్ చేస్తారంటూ ఇతర పార్టీ నేతలతో ఆరోపణలు గుప్పించే వైసీపీ నేతలు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొని ఉంది. ఏబీఎన్ లో ప్రసారమైన ఈ కధనం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.



