2024 ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతగా వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంచివాళ్ళు – సౌమ్యులు అంటూ ప్రజల ముందుకు తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ వైసీపీ నేతల మంచితనం, సౌమ్యత్వం ఏ తరహాలో ఉంటుందో ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది.
గతంలో గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికల బరిలోకి దిగిన వల్లభనేని వంశీ విషయంలో కూడా జగన్ మంచివాడు – సౌమ్యుడు అంటూ ప్రచారం చేసారు. కట్ చేస్తే ఆయన మంచితనం టీడీపీ పార్టీ కార్యలయాల మీద దాడి చేసే స్థాయిలో, ఒక వ్యక్తిని బెదిరించే స్థాయిలో ఉందనేది స్పష్టమయ్యింది.
అలాగే బాపట్ల వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ కూడా మంచివాడిగా, సౌమ్యుడిగా జగన్ చేత ముద్ర వేయించుకున్న నేతే. కానీ ఆ మంచితనం ఒక వృద్ధ మహిళను బెదిరించి, భయపెట్టే స్థాయిలో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక జోగి రమేష్ మంచితనం నకిలీ మద్యం తయారీకి దారి తీస్తే, పేర్ని నాని మంచితనం రేషన్ బియ్యం అక్రమాలకు పాకింది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వైసీపీ కీలక నేతలు లిక్కర్ స్కాం లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయితే ఈ సోకాల్డ్ నేతల మంచితనం స్థాయి దాదాపు 3500 కోట్ల అవినీతి ఆరోపణలు. ఇలా జగన్ ప్రచారం చేసిన వైసీపీ మంచివాళ్ళు – సౌమ్యులు ఒక్కో రకం కేసులతో ఒక్కో విధంగా అరెస్టయ్యి జైలుకెళ్లి, బైలు మీద బయటకొచ్చారు.
ఇక కడప ఎంపీ అవినాష్ మంచితనాన్ని పార్టీ అధినేత జగన్ ఒక రకంగా ప్రచారం చేస్తుంటే ఆయన సోదరి వివేకా కుమార్తె మరో రకంగా ప్రచారం చేస్తుంది. వివేకా గొడ్డలి వేటు తాలూకా రక్తపు మరకలు అవినాష్ రెడ్డి మంచితనానికి నిదర్శనం అంటూ సునీత వైఎస్ అవినాష్ రెడ్డి కి వ్యతిరేకంగా గత కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తుంది.
ఇక వీరి కోవలోకి చేరుకోవడానికి ఇప్పుడు మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పోటీపడుతున్నారు. అయితే ఈయన గారి మంచితనం – సౌమ్యత్వం రాష్ట్ర సరిహద్దులు దాటింది. బ్రహ్మనాయుడు అన్న ఎంతో మంచివాడు సౌమ్యుడు ఆయనకు మీ ఓటు అంటూ గత ఎన్నికలలో వైఎస్ జగన్ బొల్లా కోసం ప్రచారం చేసారు.
అయితే ఈయన కూడా తన పార్టీ నేతల మంచితనాన్ని వారసత్వంగా కొనసాగించేందుకు తెలంగాణ లో భూకబ్జా ల వరకు వెళ్లారు. హైద్రాబాద్ సమీపంలో అత్యంత ఖరీదైన సుమారు 9 ఎకరాల తెలంగాణ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ భూ పాత్రలను సృష్టించి, వాటికీ బలం చేకూర్చేందుకు నకిలీ జీవో లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ తెలంగాణ పోలీసులకు తమిళనాడులో పట్టుబడ్డారు.
ఇలా వైసీపీ పార్టీలో జగన్ మెచ్చిన, వైసీపీ శ్రేణులు నమ్మిన మంచివాళ్ళు – సౌమ్యులు చాలామందే ఉన్నారనేది స్పష్టమవుతుంది. అయితే ఆ మంచితనం – సౌమ్యత్వం అందరు అనుకునే తరహాలో ఉండకపోవడం, అదోరకంలో ఉండడం ఇక్కడ కోసం మెరుపు.
మరి భవిష్యత్ లో ఏపీలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ 2.0 కోసం జగన్ ఇటువంటి మంచివాళ్లను సౌమ్యులనే రంగంలోకి దింపుతారా.? లేదా మరికొంతమంది మంచివాళ్లను, సౌమ్యులను ఏపీ ప్రజలకు పరిచయం చేస్తారా.?




