వైసీపీ నేతలందరూ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటి?

YCP Leaders

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలందరూ నిత్యం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలపై జగన్‌ ప్రభుత్వంతో పోరాడుతుండేవారు. జగన్‌ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను, వైఫ్యల్యాలను, అసమర్దతని, అవినీతిని, ఆరాచకాలను ఎండగడుతూనే ఉండేవారు.

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు కూడా అదే చేస్తున్నారా?అంటే అవునని చెప్పలేము. జగన్‌ సంక్రాంతి పండుగ తర్వాత జగన్‌ ప్రజల మద్యకు వస్తారని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. కానీ ప్రాణ భయంతో తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రావడం మానేసి చాలా కాలమే అయింది. ఆయన ప్యాలస్‌లో నుంచి బయటకు రావాలంటే రాష్ట్రంలో ఎక్కడైనా శవం లేవాలి లేదా వైసీపీలో ఎవరైనా జైలుకి పోవాలన్నట్లు సాగుతోంది.

ADVERTISEMENT

పోనీ ప్రజల మద్యకు రాకపోయినా వైసీపీ నేతలందరూ సోషల్ మీడియాలోనైనా ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటాలు చేసేస్తున్నారా? అంటే అదీ లేదు.

ఎంతసేపూ తమ కేసులు, తమ అరెస్టులు గురించి మాట్లాడుతూ ఆ కారణంగా రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని వాదిస్తుంటారు.

అంటే అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించేసినట్లేనన్న మాట!

ఇవన్నీ సరిపోవన్నట్లు.. మంత్రి నారా లోకేష్‌ తన సొంత డబ్బుతో కుట్టు మిషన్లు కొనుగోలు చేసి మహిళలకు ఇస్తే, భారీగా అవినీతి జరిగిపోయిందని, ఆయన తిరుగుళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.172 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి హెలికాఫ్టర్‌ కొనబోతోందనే దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు.

వైసీపీ నేతలందరూ కట్టకట్టుకొని వచ్చినట్లు హటాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. వారిలో అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, మార్గాన్ని భరత్, అనంత వెంకటరామిరెడ్డి, సాకే శైలజానాథ్, గోరంట్ల మాధవ్‌, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పినిపే శ్రీకాంత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెన్నపూస రవీంద్రా రెడ్డి తదితరులున్నారు.

ఇంతకాలం సోషల్ మీడియాలో కూడా కనబడని ఈ వైసీపీ నేతలందరూ హటాత్తుగా ఎందుకు ప్రత్యక్షమయ్యారు?అనే సందేహం కలుగక మానదు.

మద్యం కుంభకోణం కేసులో జగన్‌ని అరెస్ట్‌ చేయడం ఖాయమని వారు గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. బహుశః అందుకే జగన్‌కి రక్షణ కవచంలా నిలబడుతూ ఒకేసారి మూకుమ్మడిగా సిఎం చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నట్లు భావించవచ్చు.

కానీ వారు ఇలా కట్టకట్టుకొని రావడం గమనిస్తే, తాడేపల్లి ప్యాలస్‌లో ఒంటర్ జీవితం గడుపుతున్న వారి అధినేత జగన్‌ అభద్రతాభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories