ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు గాను తన చివరి అస్త్రం ప్రయోగించేసారు. పార్లమెంట్ లో కేంద్రంపై పోరాటం తీవ్రతరం చేసి టీడీపీ మైలేజ్ తెచ్చుకుందని తాము మాత్రం వెనుకబడిపోయాం అని భావించి చివరి అస్త్రంగా ఎంపీల రాజీనామాలు తెర మీదకు తెచ్చారు జగన్.
వచ్చే బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎమ్.పిలు పోరాడతారని, అయినా ప్రభుత్వం అంగీకరించకపోతే ఏప్రిల్ ఆరో తేదీన వారంతా రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ఇటీవలే కాలంలో వైకాపా కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనే అపవాదు తెచ్చుకుంది. అది తుడుచుకునే ప్రయత్నమే ఇది.
అదే సమయంలో ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే త్రిపుర, కర్ణాటక ఎన్నికలలో బీజేపీకి ఇబ్బంది అవుతుందని దానిని ఏప్రిల్ వరకు పొడిగించినట్టుగా కనిపిస్తుంది. బీజేపీకి ఇబ్బందైతే తనకు వచ్చే ఇబ్బందులను జగన్ గ్రహించినట్టు ఉన్నారని విమర్శకులు అంటున్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని జగన్ కు తెలియదంటే నమ్మే వారు ఎంత మంది ఉండొచ్చు?
ఏప్రిల్ లో రాజీనామాలు చేస్తే వాటి ఆమోదానికి 2-3 నెలలు పట్టచ్చు. అక్కడనుండి ఎన్నికలు చాలా దగ్గరలో ఉండటంతో ఎన్నికల సంఘం ఉపఎన్నికలు నిర్వహించకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కాబట్టి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు కర్రా ఇరగకుండా పామూ చావకుండా తెలివిగా ప్రకటించినట్టు ఉంది.



