జగన్ కు ఎవరితో రాజకీయ పొత్తు అవసరం లేదు, సింహం సింగల్, వైసీపీ కాదు ఎవరితో మింగిల్ అంటూ వైసీపీ చేసుకునే ప్రచారాలు వాస్తవ రూపంలో ఏ మేరకు ఆచరణలో ఉంటుంది అని గమనిస్తే ఆడవారి మాటలకు అర్దాలు వేరులే అనే సామెత ఎంత వాస్తవమో వైసీపీ ప్రచారాలు కూడా అంతే వాస్తవం అనాలేమో బహుశా..!
అవును, వైసీపీ నేతలు చెపుతున్నట్టు, జగన్ ప్రకటనలు చేస్తున్నట్టు వైసీపీ ఎవరితోనూ అధికారిక రాజకీయ పొత్తులు పెట్టుకోదు, కానీ తెరచాటు మాత్రం అందరితోనూ అంతర్గత బంధాలను కొనసాగిస్తుంది. 2014 నాటి నుంచి నేటి వరకు వైసీపీ ఏనాడు కేంద్ర బీజేపీ పై ఏ ఒక్క అంశం పైన నోరెత్తి విమర్శ చెయ్యలేదు, చేసే సాహసానికి సిద్ధం కాలేదు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక హోదా నుంచి పోలవరం పూర్తి వరకు వైసీపీ ఏనాడు బీజేపీ ని వేలెత్తి చూపలేదు. అలాగే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి నుంచి కూటమి గెలుపు వరకు ఈవీఎం లు అంటూ జగన్ అండ్ కో టీడీపీ పై నిందలు వేస్తుంది కానీ ఎన్డీయే లో భాగమైన బీజేపీ జోలికి వెళ్లేందుకు సాహసించలేదు.
ఇక మేము బీజేపీ కి వ్యతిరేకం అంటూనే కేంద్రంలో బీజేపీ పెట్టె ప్రతి బిల్లులకు చట్టసభలలో బేషరతుగా ఆమోద ముద్ర వేసి పిల్లి తానూ కళ్ళు మూసుకుని పాలు తాగి తనను ఎవరు చూడలేదు అని భావించినట్టు భావిస్తుంది. ఇప్పటికి జగన్ అక్రమాస్తుల కేసు బెయిలు వద్దే ఆగిపోవడానికి, వైస్ వివేకా గొడ్డలి వేటు దారుణ హత్య కేసు అవినాష్ రెడ్డి గడప వరకు రాకపోవడానికి,
తిరుమల కల్తీ నెయ్యి కేసు కేవలం విమర్శలు – ప్రతివిమర్శలకే పరిమితం కావడానికి, వైసీపీ లిక్కర్ కేసులో కిక్కు లేకపోవడానికి బీజేపీ తో వైసీపీ కి ఉన్న తెరచాటు రాజకీయ బంధాలే కారణమనేది జగమెరిగిన సత్యమే. ఇదిలా ఉంటే, ఇక మరోపక్క నిత్యం టీడీపీ పై కత్తులు దూస్తూ, బాబు పై విషం చిమ్మే బిఆర్ఎస్ తో కూడా వైసీపీ మింగిల్ అవుతుంటది.
ఇందుకోసం అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టగలిగే స్థాయికి వైసీపీ దిగజారగలదు అని 2019 ఎన్నికల ఫలితాల తరువాత చాల స్పష్టంగా చేసి చూపించింది. ఒకే ఒక్క సంతకంతో నాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ హైద్రాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేసేసారు.
అలాగే అక్కడ స్విచ్ వేస్తె ఇక్కడ లైట్ వెలుగుతుంది అనేదానికి ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత రాజకీయ సంబంధాలే ప్రత్యక్ష ఉదాహరణలు. వైసీపీ గెలుపు కోసం ఏపీ రాజకీయాలలో కేసీఆర్ రిటర్న్ గిఫ్టులు ఇచ్చే స్థాయికి వెళ్లిపోవడం, ఏపీలో వైసీపీ చేసిన అరాచకాలకు తెలంగాణలో కేసీఆర్ రిటర్న్ గిఫ్టులు అందుకునే స్థాయికి పడిపోవడానికి వైసీపీ – బిఆర్ఎస్ మధ్య ఉన్న బలమైన బంధాలే కారణం.
అయితే ఇప్పుడు ఏపీలో పుట్టుకొచ్చిన చోటామోటా పార్టీల వెనుక కూడా వైసీపీ నీలి నీడలు స్పష్టంగా కనిపిస్తాయి, వినిపిస్తాయి కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయిన కొంతమంది మాజీల వెనుక కూడా వైసీపీ రంగు దర్శనమిస్తుంది.
ఇలా సింహ సింగిల్ అంటూ వైసీపీ చేసుకునే నీలి ప్రచారాల వెనుక బీజేపీ తో బిఆర్ఎస్ తో ఇక కొన్ని తోక పార్టీలతో వైసీపీ మింగిల్ అయిన సాక్ష్యాలు ఎన్నో ఎన్నెన్నో. అయితే వైసీపీ తెరచాటున కొనసాగించే ఈ రాజకీయ బంధాలు అన్ని కూడా జగన్నాటకాలేనా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చింపబడుతున్నాయి. అయితే ఆ నాటకాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతూనే వస్తున్నాయి.




