ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో జతకట్టడానికి సిద్ధం అని విపక్షనేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశాన్ని తెరమీదకు తేవడానికి వైకాపా ప్రయత్నిస్తుంది. తాము గతంలో ప్రకటించిన విధంగా ప్రత్యేక హోదా పై ఎంపీల రాజీనామాకు వైసీపీ కట్టుబడి ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తేల్చి చెప్పారు.
అయితే అది ఎప్పుడో ఎలానో చెప్పకుండా ఎప్పటిలానే 28 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని రాజ్యంగ వ్యవస్థను చంద్రబాబు నీరుగార్చారని అంటూ రొటీన్ విమర్శలు చేసేసారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు 16 నెలల సమయం ఉంది. ఒకపక్క ముందస్తు ఎన్నికల ముచ్చట కూడా నడుస్తుంది.
కొందరైతే ఏకంగా డిసెంబర్ నాటికే ఎన్నికలు వస్తాయి అంటున్నారు. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పదేపదే పిలుపునిస్తున్నారు. ఇటువంటి సమయంలో రాజీనామాలు చేయకుండా ఇదిగో అదుగో అంటూ కాలం గడిపితే వైకాపా చిత్తశుద్ధిని కూడా శంకించాల్సివస్తుంది.
రాజకీయ లబ్ది కోసం చేసే ప్రకటనలలో కాస్త చొరవ దైర్యం ఉంటేనే ఆ లబ్ది చేకూరుతుంది. ఆలా కాకుండా వట్టి మాటలు చెప్పేసి ప్రజలను తమను విశ్వసిస్తారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. వైకాపా ఎంపీలు రాజీనామాలు చెయ్యదలిస్తే రానున్న బడ్జెట్ సమావేశాలకు మించిన తరుణం దొరకదు.



