ఎన్నికలలో ఓడిపోయిన పార్టీ నుంచి అధికార పార్టీలోకి నేతల ఫిరాయింపులు చాలా సాధారణమే. వాటి వలన ఆ పార్టీ ఇంకా బలహీనమవుతుంది.
అలాంటప్పుడు కూడా ఆ పార్టీ ధృడంగా నిలబడి అధికార పార్టీని ఎదుర్కొని పోరాటాలు చేస్తూనే ఉండాలి. అప్పుడే అది మనుగడ సాగించగలదు.
టీడీపీ, వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆవిదంగా నిలబడి పోరాడాయి. ఇప్పుడు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీలు ఆ దశలోనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలను వీడుతున్నా నిలబడి పోరాడుతున్నాయి.
ఏపీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించాల్సిన అవసరమే లేదు. ఇదీ వైసీపీకి కలిసి వచ్చిన అదృష్టమే అని చెప్పుకోవచ్చు.
కానీ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను జగన్ ఆపలేకపోతున్నారు. ఇప్పటికే జయమంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పొత్తుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, పొత్తుల సునీత కలిపి మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.
తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సీనియర్ వైసీపీ నేత, ఎమ్మెల్సీ జకీయా ఖానంది పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. ఆమె 2020 లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. కానీ పార్టీలో తనకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అసంతృప్తితో పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కనుక వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆమెతో కలిపి 7కి చేరింది.
ఓ పక్క మద్యం కుంభకోణంతో సహా వివిద కేసులలో పార్టీ ముఖ్యనేతలు కేసులు ఎదుర్కోవలసి వస్తుంటే, మరోపక్క పార్టీలో ఈవిదంగా రాజీనామాలు కొనసాగుతుడటంతో తట్టుకొని నిలబడటం, కూటమి ప్రభుత్వంతో పోరాడటం వైసీపీకి చాలా కష్టమే. అయినా పోరాడుతూనే ఉంది. కానీ వైసీపీలో ఈ రాజీనామాలు, జైళ్ళకు వెళ్ళినవారు పోగా వచ్చే ఎన్నికల నాటికి ఎంతమంది మిగులుతారో?




