ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆఫరేషన్ ఆకర్ష్’ కొనసాగుతూనే ఉంది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది. త్వరలో మరో 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరనున్నారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పైనే బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన జలీల్ ఖాన్ ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా జగన్ వ్యవహార తీరుపై మండిపడ్డ జలీల్ ఖాన్… “జగన్ వైఖరిని భరించలేకే తాను పార్టీ మారానని, సొంత బంధువులు కూడా జగన్ ను భరించలేకపోతున్నారని, ఈ కారణంగానే గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు ప్రస్తుతం పార్టీలు మారుతున్నారని” అన్నారు. ఈ సందర్భంగా జగన్ ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పోల్చుతూ జలీల్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.
“వైఎస్ ఎంత అవినీతి చేసినా పార్టీ నేతలను నవ్వుతూ పలకరించేవారు. జగన్ లో అవినీతికి తోడు నిరంకుశత్వమూ ఉంది. ఎవరినీ అడగడం గాని, ఎవరైనా చెప్పేది వినే అలవాటు గాని లేదు. అసెంబ్లీలో ఆయన చేయి ఊపితే… పోడియం వద్దకు పోవడం మినహా మాకు వేరే పని ఉండేది కాదు. జగన్ ను కలవాలంటే… మేడపై నుంచి కిందకు కూడా రారు. మూడు రోజుల ముందుగా పీఏను అడగాలి. అలాగే జగన్ పడుకున్నప్పుడు లేచే దాకా వెయిట్ చేయాలి. ఈ క్రమంలో మనల్ని ఎవరైనా హత్య చేసినా పట్టించుకునే దిక్కుండదు” అని జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.



