బస్టాండ్ కూలిపోతే అదీ టిడిపికే అంకితం?

Visakhapatnam-Bus-Bayవిశాఖ నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కొత్తగా నిర్మించిన బస్-బే (బస్టాండ్) మొన్న ఆదివారం ఉదయం ఓ పక్కకు ఒరిగిపోయింది. సాధారణంగా ఏ వార్త పత్రికలోనైనా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. కనుక అదేమీ పెద్ద విషయం కాదు. కానీ అదేదో గొప్ప కట్టడమన్నట్లు దానికీ సిఎం జగన్‌ ఫోటో తగిలించుకోవడం, ప్రారంభోత్సవానికి ముందే అది కాస్త కూలిపోవడంతో ఈ వార్త హైలైట్ అయ్యింది.

దీనిపై వైసీపీ ట్విట్టర్‌లో స్పందిస్తూ, #ఫ్యాక్ట్ చెక్: “అస‌త్య వార్త‌ల ప్ర‌చారంలో మరింత దిగ‌జారిపోతున్న ఎల్లోమీడియా. విశాఖ‌లో నిర్మాణంలో ఉన్న బ‌స్ బే చిత్రాల‌ను మొద‌టి పేజీలో వేసి, కొత్త‌గా నిర్మించిన బ‌స్ బే కూలిపోయిందంటూ త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చురించిన ఈనాడు ప‌త్రిక‌. ఇంకా నిర్మాణం పూర్తికాని బ‌స్ బేపై వ‌ర్ష‌పునీటిని తొల‌గించే క్ర‌మంలో పై షేడ్ కాస్త ప‌క్క‌కి ఒరిగితే మొత్తం బ‌స్ బే కూలిపోయిందంటూ వార్త రాసింది. ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డానికి ఎలాంటి కార‌ణాలు లేక‌పోవ‌డంతో చివ‌రికి ఇలా అసత్య వార్త‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్యపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి ప‌చ్చ‌ప‌త్రిక‌లు. ఇలాంటి వార్త‌ల్లో ఎన్నిసార్లు నిజానిజాలు బ‌య‌ట‌కు తీసి ఛీ కొట్టినా త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చురించ‌డాన్ని మాత్రం మాన‌డం లేదు,”అంటూ ట్వీట్‌ చేసింది.

ADVERTISEMENT

బ‌స్ బే కూలిపోయిన్నట్లు సాక్షి పత్రికలో కూడా వార్త వచ్చిన సంగతి వైసీపీ చూసిన్నట్లు లేదు. సాక్షిలో దీని గురించి ఏమని పేర్కొందంటే, “ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక సెంట్రల్ పార్కు ఎదురుగా నూతనంగా నిర్మించిన బస్ బే శనివారం రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది. ” ఒకవేళ ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేసిందనుకొన్నామరి సాక్షిలో వచ్చిన ఈ వార్త సంగతేమిటి?

బస్ బే కూలిపోయినప్పుడు, సిపిఎం, జనసేన కార్పొరేటర్లు, టిడిపి నేతలు, కార్యకర్తలు అక్కడ జండాలు పట్టుకొని ధర్నా కూడా చేశారు. సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు, సిపిఎం సీనియర్ న్థెలు ఎం.సుబ్బారావు, వై.రాజు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌, ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి, టిడిపి విశాఖ దక్షిణ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తదితరులు కూలిపోయిన బస్ బే ఎదుటే బైటాయించి ధర్నా చేశారు.

రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ బే చిన్న గాలివానకే కూలిపోవడంపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ వార్త కూడా దాదాపు అన్ని పత్రికలో వచ్చింది. అంటే బస్ బేకూలిపోవడం నిజమన్న మాట!

కానీ బస్ బేపై నిలిచిన వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నప్పుడు షెడ్ కొంచెం పక్కకి ఒరిగితే, కూలిపోయిందంటూ తప్పుడు వార్తలు వ్రాసి ప్రభుత్వంపై బురద జల్లాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందంటూ వైసీపీ తన ప్రభుత్వ వైఫల్యానికి కవరింగ్ ఇచ్చుకొంటూ, దానినీ ప్రతిపక్షాలనే నిందించడం విశేషమే కదా?

అసలు బస్ బేమీద వర్షపూ నీరు నిలిచిపోవడం ఏమిటి? దానిని తొలగించడం ఏమిటి?తొలగిస్తుంటే షెడ్ ఓ పక్కకి ఒరిగిపోవడం ఏమిటి? తప్పుని కూడా సరిగ్గా కవర్ చేసుకోకపోతే ఎలా?

ADVERTISEMENT
Latest Stories